17-02-2026 12:02:50 AM
బీసీ బిడ్డను ఎదగనీయకుండా పన్నాగం
కాంగ్రెస్ పార్లమెంట్ ఇంచార్జి నీలం మధు
కౌన్సిలర్లను ఘనంగా సన్మానం
పటాన్ చెరు, ఫిబ్రవరి 16 ఇస్నాపూర్ మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నికలో నైతిక విజయం కాంగ్రెస్ పార్టీదేనని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. సోమవారం ఇస్నాపూర్ మున్సిపల్ ఎన్నికల చైర్మన్ ఎన్నిక అనంతరం ఆయన ప్రెస్ నోట్ విడుదల చేశారు. బీసీ బిడ్డ ఎదుగుదలను ఓర్చుకోలేక ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, ఎంపీ రఘునందన్ రావు కుమ్మక్కు రాజకీయాలకు తెరలేపారని ఆరోపించారు.
పొద్దున లేస్తే టీవీ ఛానల్లో బీఆర్ఎస్ పై, హరీష్ రావుపై ఆరోపణలు చేసే దొర రఘునందన్ రావు మళ్ళీ ఆ దొర కాళ్ళ దగ్గర బానిసగా మరిపోయాడని విమర్శించారు. దీన్నిబట్టి ఎంపీ ఎన్నికల్లో హరీష్ రావు, రఘునందన్ రావు, ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అనైతిక బంధం నేడు బట్టబయలు అయిందని తెలిపారు. ఎంపీ రఘునందన్ మెడలు పట్టి బయటకు గెంటిన పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో ఎక్స్ అఫిషియో ఓటు వేయడం ఆయన మనస్సాక్షికే వదిలేస్తున్నామని వ్యాఖ్యానించారు. ఓటమితో కలత చెంది కుంగిపోయే మనస్తత్వం తనది కాదని,
మళ్లీ ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం పనిచేసి కాంగ్రెస్ అభివృద్ధి కోసం కష్టపడతామని స్పష్టం చేశారు. ఇస్నాపూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిన కౌన్సిలర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపి ఘనంగా సత్కరించారు. చైర్మన్ సీటు చేజారినంత మాత్రాన కార్యకర్తలు ఎవరు నిరుత్సాహ పడవద్దని రాష్ట్రంలో మన కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉందని ప్రభుత్వ సహకారంతో ప్రజలకు కావలసిన అభివృద్ధి కార్యక్రమాలను సాధించుకుందామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, కాంగ్రెస్ శ్రేణులు తదితరులు పెద్దఎత్తున పాల్గొన్నారు.