15-06-2025 05:46:50 PM
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్వామి పిలుపు..
మహబూబాబాద్ (విజయక్రాంతి): విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 18న ఇందిరాపార్క్ వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని రాష్ట్ర జేఏసీ ప్రధాన కార్యదర్శి ఎన్.స్వామి(State JAC General Secretary N. Swamy) పిలుపునిచ్చారు. మహబూబాబాద్ లో ఆదివారం ఎండి ఖదీర్ అధ్యక్షతన జరిగిన సిఐటియు అనుబంధ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ సర్కిల్ స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ... విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులకు విద్యార్హతలను బట్టి కన్వర్షన్ చేయాలని కోరారు.
వీరి సమస్యల పరిష్కారం కోసం అనేక రోజులుగా పోరాటాలు చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదన్నారు. యాజమాన్యంలో కదలిక కోసం ఈ నెల 18న ఇందిరాపార్క్ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి భారీ ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ధర్నాలు మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ కే.నాగేశ్వర్, ప్రొఫెసర్ జి. హరగోపాల్ పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.ప్రసాద్, సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకుల రాజు, కుంటా ఉపేందర్, తెలంగాణ ఎన్పీడీసీఎల్ కంపెనీ కార్యదర్శి బి.వెంకట రాజు, కొత్తగూడెం రీజినల్ అధ్యక్షులు కే.శ్రీనివాస్, కొత్తగూడెం జిల్లా గౌరవ అధ్యక్షులు రమేష్, స్థానిక నాయకులు నీలం శ్రీనివాస్, పిల్లి వెంకటేశ్వర్లు, వీరభద్రం, అక్కినపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.