16-02-2026 12:32:58 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 15 (విజయక్రాంతి): నూతనంగా ఏర్పాటైన సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పనితీరు ప్రజలకు స్పష్టంగా కనిపించాలని, క్షేత్రస్థాయిలో ప్రగతి వెల్లివిరియాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆకాంక్షించారు. సైబరాబాద్ కార్పొరేషన్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన జి సృజన ఆదివారం ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. నగర అభివృద్ధి, కార్పొరేషన్ భవిష్యత్తు కార్యాచరణపై సీఎం ఆమెకు కీలక దిశానిర్దేశం చేశారు.
ముఖ్యమంత్రితో భేటీ అనంతరం కమిషనర్ సృజన వివరాలను వెల్లడించారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా సేవలు అం దించే అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ భేటీలో సీఎం పలు సూచనలు చేశారని తెలిపారు. ‘కొత్తగా ఏర్పడిన కార్పొరేషన్ కావడంతో ప్రజల్లో భారీ అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా యంత్రాంగం పనిచేయాలి. కేవలం ప్రణాళికలు మాత్రమే కాదు.. క్షేత్రస్థాయిలో కచ్చితమైన మార్పు తీసుకురావాలి అని’ సీఎం స్పష్టం చేసినట్లు పేర్కొన్నారు.