5 July, 2026 | 5:20 AM

పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి

12-06-2024 12:25 AM

మెదక్ కలెక్టర్ రాహుల్‌రాజ్

జక్కపల్లి మోడల్ స్కూల్‌లో బస 

గ్రామస్తులకు అవగాహన 

నర్సాపూర్, జూన్ 11: బడి బయట ఉన్న పిల్లలందరూ ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా అధికారులు చొరవ తీసుకోవాలని మెదక్ కలెక్టర్ రాహుల్‌రాజ్ సూచించారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా సోమవారం రాత్రి నర్సాపూర్ మండలం జక్కపల్లిలోని తెలంగాణ మోడల్ స్కూల్‌లో కలెక్టర్ బస చేశారు. మంగళవారం గ్రామంతో పాటు సమీపంలోని తండాలలో ఉదయం 6 గంట ల నుంచి మధ్యాహ్నం వరకు పర్యటించి పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించా రు. పిల్లలను కచ్చితంగా ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చాలని కోరారు.

ఎవరైనా విద్యా ర్థులు 10వ తరగతి, ఇంటర్‌తో ఆపేస్తే వారి తో మాట్లాడి సరైన కళాశాలలో అడ్మిషన్ ఇప్పించే విధంగా అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు కృషి చేస్తోందని, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ లు ఏర్పాటు చేసి వాటి ద్వారా మానిటరింగ్ చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఆర్‌డీవో జగదీశ్వర్‌రెడ్డి, తహసీల్దార్ కమలాద్రి, ఎంపీడీవో రమాదేవి, ఎంఈవో బుచ్యానాయక్, ఆర్‌ఐ సిద్దిరాంరెడ్డి, మాజీ సర్పంచ్ లక్ష్మీశ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. 

పంచాయతీ కార్యదర్శిపై ఫిర్యాదు..

జక్కపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శిపై కలెక్టర్ రాహుల్‌రాజ్‌కు గ్రామస్తులు ఫిర్యా దు చేశారు. కార్యదర్శి జ్యోతి విధులకు సక్రమంగా హాజరు కావడం లేదని, సమస్యలపై పట్టించుకోవడం లేదని ఆమెపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.