07-06-2025 12:00:00 AM
వివాదంలో ఉన్న భూమి కోసం ఇరు వర్గాల ఘర్షణ
బెల్లంపల్లి అర్బన్, జూన్ 6: ప్రభుత్వం వివాదాస్పదమైన భూసమస్యల పరిష్కారం కోసం తలపెట్టిన రెవెన్యూ సదస్సు రెండు వర్గాల మధ్యకు ఘర్షణకు వేదికైన సంఘటన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం చెంద్రవెల్లిలో చోటుచేసుకుంది. ఒకే భూమి గురించి రెండు వర్గాలు దరఖాస్తులు సమర్పిస్తున్న క్రమంలో గొడవ జరిగింది.
ఒకరినొకరు చెప్పులతో కొట్టుకున్నారు. దీంతో అప్పటిదాకా ప్రశాంతంగా జరిగిన రెవెన్యూ సదస్సులో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. చంద్రవల్లి పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం రెవెన్యూ సదస్సులో భూభారతి దరఖాస్తు చేసుకునే సమయంలో పుదరి రమేష్, మైల రాజుల మధ్య గొడవ తలెత్తింది. మాట మాట పెరిగి ఇరువురూ అధికారుల సమక్షంలోనే ఒకరినొకరు దూషించుకుంటూ చెప్పులతో కొట్టుకున్నారు. రెవెన్యూ సిబ్బంది ఘర్షణ పెట్టుకున్న వ్యక్తులను నివారించే ప్రయత్నం చేశారు.
ఈ ఘర్షణలో ఓ మహిళ దరఖాస్తు ఇవ్వడం కోసం వచ్చి ఇరుపక్షాల మధ్య జరిగిన గొడవలో ఇరుక్కుపోయారు. మధ్యలో చిక్కుకున్న అక్కడ సిబ్బంది సదరు మహిళలను పంచాయతీ కార్యాలయం నుంచి రెవెన్యూ సిబ్బంది బయటకు తీసుకోచ్చారు. రెవెన్యూ అధికారుల సమక్షంలోనే గ్రామపం చాయతీ కార్యాలయంలోనే ఇరువర్గాల ఘర్షణ చర్చనీయాంశంగా మారింది. గొడవకు కారణమైన వారిని మండల రెవెన్యూ తహసీల్దార్ కృష్ణ కేసు నమోదు చేసి బైండోవర్ చేయాలని పోలీసులను ఆదేశించారు.