03-12-2025 02:41:20 PM
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ 8, 9 తేదీల్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో పాల్గొనాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఆహ్వానించారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి ఢిల్లీ పార్లమెంట్ భవన్లోని ప్రధానమంత్రి కార్యాలయంలో మోదీని మర్యాదపూర్వకంగా కలిసి సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్కు సంబంధించి ప్రత్యేకంగా రూపొందించిన ఆహ్వాన పత్రికను అందజేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశిత వికసిత్ భారత్-2047 లక్ష్యాలకు అనుగుణంగా, తెలంగాణ వంతుగా దేశ ఆర్థిక ప్రగతిలో తోడ్పాటును అందించాలన్న సంకల్పంతో తెలంగాణ రైజింగ్ 2047 దార్శనిక పత్రం రూపొందించినట్టు ఆయన వివరించారు.
అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ 2047 నాటికి తెలంగాణ రాష్ట్రం 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా ఎదగాలని, సమగ్రమైన ప్రణాళికలతో రోడ్ మ్యాప్ను రూపొందించినట్టు ప్రధాని మోదీతో చెప్పారు. వివిధ రంగాల్లో నిష్ణాతులు, నిపుణులు, నీతి ఆయోగ్ సలహా సూచనలను క్రోడీకరించి మేధోమథనం అనంతరం విజన్ డాక్యుమెంట్ను రూపొందించినట్టు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
కేంద్రం సహకరించాలి
తెలంగాణ రైజింగ్ లక్ష్యాలకు అనుగుణంగా ఫలితాలు సాధించడంలో, అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం తగిన సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి, ప్రధానమంత్రిని కోరారు. హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ విస్తరణకు అవసరమైన అనుమతులు మంజూరు చేయాలని, మొత్తం 162.5 కిలోమీటర్ల పొడవునా విస్తరించే ప్రతిపాదనలను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సమర్పించిందని గుర్తు చేశారు.
రూ.43,848 వేల కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టును కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్గా చేపట్టేందుకు ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగానికి కేబినేట్ ఆమోదంతో పాటు ఆర్థిక పరమైన అనుమతులు, అలాగే దక్షిణ భాగం నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని అభర్థించారు. రీజనల్ రింగ్ రోడ్డు వెంట ప్రతిపాదనల్లో ఉన్న రీజనల్ రింగ్ రైలు ప్రాజెక్టును వీలైనంత తొందరగా చేపట్టాలని సీఎ విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్ నుంచి అమరావతి మీదుగా మచిలీపట్నం పోర్ట్ వరకు 12 లేన్ల గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే, హైదరాబాద్ నుంచి బెంగుళూరు హై స్పీడ్ కారిడార్ను అభివృద్ధి చేసేందుకు గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే నిర్మాణం చేపట్టేలా కేంద్రం ప్రత్యేక చోరవ చూపాలని ప్రధాని మోదీని, ఆయన కోరారు. హైదరాబాద్ నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి నిరంతరాయంగా రవాణా సదుపాయం ఉండేలా టైగర్ రిజర్వ్ మీదుగా మన్ననూర్ నుంచి శ్రీశైలం వరకు నాలుగు వరుసల ఎలివేటేడ్ కారిడార్ నిర్మాణ ప్రతిపాదనలను ఆమోదించాలని కోరుతూ వినతిపత్రం అందించారు.