18-11-2025 12:44:43 PM
హైదరాబాద్: ప్రపంచంలోనే ఆర్థికంగా ఎదిగిన దేశంగా భారత్ ను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం(Central Government) కృషి చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పేర్కొన్నారు. ఐటీసీ కోహేనూర్లో జరిగిన నైరుతి రాష్ట్రాల పట్టణాభివృద్ధి ప్రాంతీయ సమావేశంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. కేంద్రం నిర్దేశించుకున్న లక్ష్యాల్లో తెలంగాణ రాష్ట్రం కూడా భాగం అవుతూందని చెప్పారు. రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తేనే.. దేశాభివృద్ధి మరింత వేగం అవుతుందని సూచించారు. కేంద్రం నిర్దేశించుకున్న 30 ట్రిలియన్ డాలర్ల ఎకానమీలో తెలంగాణ రాష్ట్రం(Telangana State) వాటా 10 శాతం ఉండాలని భావిస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాజెక్టులకు కేంద్రం త్వరగా అనుమతులు ఇవ్వాలని సీఎం కోరారు. ప్రాజెక్టులకు వేగంగా అనుమతులు ఇస్తే.. హైదరాబాద్ అభివృద్ధి చెందుతుందని చెప్పారు. హైదరాబాద్ అభివృద్ధి చెందితే దేశ ఆర్థిక వ్యవస్థ మరింత కీలకంగా మారుతోందన్నారు. హైదరాబాద్ ను అభివృద్ధి చేయడంతో పాటు ఒక కొత్త నగరాన్ని నిర్మించాలని భావిస్తున్నామని ముఖ్యమంత్రి వివరించారు.
తెలంగాణ రైజింగ్-2047(Telangana Rising-2047) పేరుతో కొత్త ప్రణాళిక రూపొందించామని ఆయన వెల్లడించారు. జీడీపీలో ప్రధానం 5 మెట్రోపాలిటన్ నగరాలు(Metropolitan cities) ఢిల్లీ, ముంబయి, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ దేశానికి ఎంతో కీలకంగా ఉన్నాయన్నారు. కేంద్రం సహకరించకుంటే రాష్ట్రాల అభివృద్ధి కుంటుపడుతుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ మెట్రో రైలు(Hyderabad Metro Rail), ఆర్ఆర్ఆర్, మూసీ అభివృద్ధికి కేంద్రం సహకరించాలని పునరుద్ఘాటించారు. ముఖ్యమంత్రులకు ఉన్న ఇబ్బందులేంటో ప్రధాని మోడీకి కూడా తెలుసని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దేశానికి పెద్దన్నగా ఉన్న మోదీ సహకరిస్తేనే అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని సూచించారు. మోదీ గుజరాత్ మోడల్ రూపొందించుకున్నట్లే తాము కూడా తెలంగాణను మోడల్ రూపొందించుకున్నామని తెలిపారు. మోదీ సబర్మతి నది ప్రక్షాళన చేపట్టినట్లే తాము మూసీ పునరుజ్జీవనం చేపట్టామని వెల్లడించారు. ప్రధాని మోదీ.. గుజరాత్ కు ఇచ్చిన సహకారాన్నే మేం తెలంగాణకు కోరుతున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.