25-06-2025 08:17:46 PM
హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా నూతన తరగతి గదులను నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉన్నత ప్రమాణాలతో తెలంగాణలో విద్యా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని సీఎం పేర్కొన్నారు. విద్యా శాఖపై ముఖ్యమంత్రి తెలంగాణ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఆ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. జిల్లాల్లో అదనపు కలెక్టర్లు వారంలో కనీసం రెండు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించాలని ఈ సందర్భంగా ఆదేశాలు జారీ చేశారు.
ఈ ఏడాది ప్రైవేటు పాఠశాలల నుంచి 48 వేల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని అధికారులు సీఎంకి వివరించారు. పెరిగిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా నూతన గదులు నిర్మించాలని ఆదేశించారు. ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు అందుకు అనుగుణంగా పాఠశాలల్లో వసతులను కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. మధ్యాహ్న భోజనం తయారీకి సంబంధించి గ్యాస్, కట్టెల పొయ్యిల బాధల నుంచి మధ్యాహ్న భోజనం తయారు చేసే మహిళలకు విముక్తి కల్పించాలని, అందుకు సోలార్ కిచెన్లు ఏర్పాటుపై తక్షణమే దృష్టి సారించాలని చెప్పారు.
పదో తరగతిలో ఉత్తీర్ణులవుతున్న విద్యార్థుల సంఖ్యకు, ఇంటర్మీడియట్లో నమోదు అవుతున్న విద్యార్థుల సంఖ్యకు మధ్య వ్యత్యాసం ఎక్కువ ఉండడంపై ముఖ్యమంత్రి గారు అధికారులను ప్రశ్నించారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులంతా కచ్చితంగా ఇంటర్మీడియట్లో చేరేలా చూడాలన్నారు.ఇంటర్మీడియట్ అనంతరం జీవనోపాధికి అవసరమైన స్కిల్డ్ కోర్సుల్లో శిక్షణ పొందవచ్చని, తద్వారా వారి భవిష్యత్తుకు ఢోకా ఉండదని ముఖ్యమంత్రి గారు అభిప్రాయపడ్డారు.