13-09-2025 03:11:51 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 12 (విజయక్రాంతి) : సమ్మక్క, సారలమ్మ దేవాలయాన్ని క్షేత్రస్థాయిలో సందర్శించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చే వారంలో మేడారానికి రానున్నట్లు ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జ్జి మంత్రి, రాష్ర్ట రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇప్పటికే మేడారం ఆలయాలకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారని తెలిపారు. సీఎం క్షేత్రస్ధాయి పరిశీలనకు వస్తున్నందున అధికారులు తగు ప్రణాళికలు, సమాచారంతో సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.
ఆలయ ఆధునీకరణకు సంబంధించిన మాస్టర్ ప్లాన్పై శుక్రవారం సచివాలయంలోని తన కార్యాలయంలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్కుమార్ ఎంపీ బలరామ్ నాయక్తో కలిసి మంత్రి పొంగులేటి సమీక్షించారు. దేవాలయం ఆధునీకరణ పనులకు తుది ఆమోదం తెలిపిన తర్వాతే పనులు ప్రారంభించి వంద రోజుల్లో పూర్తయ్యేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులకు మంత్రులు సూచించారు. భక్తులకు సౌకర్యవంతముగా ఉండేలా చేపట్టే ఆధునీకరణ పనుల్లో గిరిజనుల సాంప్రదాయాలను ప్రతిబింబించేలా ఉండాలని సూచించారు. సమీక్షలో సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.