23-04-2025 12:00:00 AM
హైదరాబాద్, ఏప్రిల్ 22 (విజయ క్రాంతి): తెలంగాణకు పెట్టుబడులు.. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనే ధ్యేయంగా సీఎం రేవంత్రెడ్డి జపాన్ టూర్ సాగింది. ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రిశ్రీధర్బాబు, తెలంగాణ రైజింగ్ బృందంతో కలిసి సాగిన ఈ పర్యటన రాష్ట్రానికి రూ.12,062 కోట్ల పెట్టుబడులను తీసుకొచ్చింది. యువతకు సుమారు 30,500 ఉద్యోగాల కల్పనకు మార్గం సుగమమైంది.
సీఎం ఇప్పటికే దావోస్, అమెరికా, దక్షిణ కొరియా పర్యటన తరహాలో తాజాగా జపాన్ పర్యటనను సైతం విజయవంతంగా ముగించారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న పారిశ్రామిక విధానాలు, హైదరాబాద్లో మౌలిక సదుపాయాలు, అందుబాటులో ఉన్న మానవ వనరుల గురించి కంపెనీల ప్రతినిధులకు వివరించి, వారి నుంచి పెట్టుబడులు రాబట్టడంలో సఫలీకృతులయ్యారు. బృందం బుధవారం తిరిగిప్రయాణమై హైదరాబాద్కు చేరుకోనున్నది.
పెట్టుబడులు ఇలా..
మారుబెనీ, ఎన్టీటీ డేటా, నెయిసా, తోషిబా, టెర్న్, రాజ్గ్రూప్ వంటి కంపెనీలో తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. ఈమేరకు రాష్ట్రప్రభుత్వంతో ఒప్పందాలు (ఎంఓయూలు) కుదుర్చుకున్నాయి. మారుబెని కంపెనీ హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో నెక్ట్స్ జనరేషన్ ఇండస్ట్రీయల్ పార్క్ ఏర్పాటు చేయనున్నది. తొలిదశలో రూ.వెయ్యి కోట్ల పెట్టుబడి పెట్టనున్నది.
దశలవారీగా మొత్తం రూ.5 వేల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా సుమారు 30 వేల మందికి ఉపాధి లభించనున్నది. అలాగే ఎన్టీటీ డేటా, నెయిసా కంపెనీలు హైదరాబాద్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ క్టస్టర్ ఏర్పాటు చేయనున్నాయి.
ఆయా కంపెనీలు రూ. 10,500 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి. తోషిబా ట్రాన్స్ మిషన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ఇండియా కంపెనీ రూ. 562 కోట్ల పెట్టుబడి తో రుద్రారంలో విద్యుత్ పరికరాలు, సామగ్రి తయారీ ఫ్యాక్టరీ నెలకొల్పనున్నది. అలాగే 500 మంది యువతకు జపాన్లో ఉద్యోగాలు కల్పించేందుకు తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ(టామ్ కామ్) టెర్న్, రాజ్ గ్రూప్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నది.