04-08-2025 08:28:51 PM
మేడ్చల్ జిల్లా కలెక్టర్ మను చౌదరి..
ఘట్ కేసర్ ఏరియా ఆస్పత్రిని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ..
ఘట్ కేసర్: రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైద్యశాఖను మరింత బలోపేతం చేస్తుందని మేడ్చల్ జిల్లా కలెక్టర్ మను చౌదరి(District Collector Manu Chaudhary) అన్నారు. సోమవారం ఘట్ కేసర్ పట్టణంలోని ఏరియా ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ మను చౌదరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... వందమంది రోగులకు గడువు తేదీ చూసి జాగ్రత్తగా ఇచ్చి, అందులో ఒక్కరికి తేదీ చూడకుండా ఇస్తే వంద మంది రోగులకు చేసిన వైద్యం కనిపించకుండా పోతుందని, ఫార్మసి సిబ్బంది ఎప్పటికప్పుడు మెడిసిన్ విచారణ తేదీ చెక్ చేస్తూ, ఆన్ లైన్ లోనే కాకుండా మ్యానువల్ గా రిజిష్టర్లను కూడా నిర్వహిస్తూ, అప్రమత్తంగా ఉంటూ పేషంట్లకు మందులు పంపిణీ చేయాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఎఎన్సి ఎన్ని కేసులు మిస్ అవుతున్నాయని, పరీక్షలకు రానివారిని ఏవిధంగా గుర్తిస్తున్నారని గైనకాలజిస్టు డాక్టరును అడిగి తెలుసుకున్నారు.
ఎఎన్సి పరీక్షలకు రానివారిని గుర్తించి ఆశావర్కర్లు, ఎఎంసిల ద్వారా వారికి కౌన్సిలింగ్ ఇప్పించాలని కలెక్టరు తెలిపారు. ప్రతి నెల ఎన్ని కేసులు సి సెక్షన్ అవుతున్నాయని, సి సెక్షన్ వరకు వెళ్లకుండా ముందు జాగ్రత్తలు తీసుకునేలా పేషంట్లకు జాగ్రత్తలు, సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు. ఇన్ పేషంట్లుగా ఉన్న చిన్నారులతో ఏమైంది ఇప్పుడు ఎలా ఉంది, ఎం చదువుతున్నారు, జ్వరం తగ్గిపోతుంది అని కలెక్టర్ వారిని పలకరించారు. ఎస్సెన్షియల్ మెడిసిన్ ఇన్డెంట్ ను పరిశీలించి, మందులు ఎలా తెప్పిస్తున్నారని అవసరమైన మందులు అందుబాటులో ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ల్యాబరేటరీని పరిశీలించి రోజుకు ఎన్ని పరీక్షలు చేస్తున్నారని, ఇక్కడ ఎన్ని పరీక్షలు అందుబాటులో ఉన్నాయని, ఇక్కడ లేని పరీక్షలు ఎక్కడ చేయిస్తున్నారని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ఎక్స్ రే విభాగాన్ని పరిశీలించి డిజిటల్ ఎక్స్ రే ఉందా అని అడిగి తెలుసుకున్నారు.
ఫోటోగ్రఫి మిషిన్స్ ను పరిశీలించి 5 మిషిన్లు సరిపోతున్నాయా అని కలెక్టరు అడుగగా, సరిపోతున్నాయని మెడికల్ ఆఫీసర్ సమాధానమిచ్చారు. ఓపి పేషంట్ల నమోదు రిజిస్ట్రేషన్ హిస్టరీ అప్ డేట్ అవుతుందా అని కలెక్టర్ ఆరా తీసారు. కలెక్టర్ ఆసుపత్రి మొత్తం కలియ తిరిగి పరిశీలించి, అవసరమైన వైద్య పరికరాలకు, మరమ్మ్తత్తులకు ఎస్టిమేషన్స్ వేసి తనకు పంపాలని కలెక్టర్ మెడికల్ ఆఫీసర్ కు సూచించారు. రోగులకు అందిస్తున్న సేవలు, సిబ్బంది హాజరు పట్టిక ఓపి రిజిస్టర్, డెలివరీ రిజిస్టర్, పరిశీలించి వైద్య సిబ్బందికి తగు సూచనలు చేశారు. పేద ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం వైద్య శాఖను బలోపేతం చేస్తూ పటిష్ట కార్యచరణ ద్వారా ముందుకు పోతుందని దానికి అనుగుణంగా వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. సీజనల్ వ్యాధులను దృష్టిలో పెట్టుకొని వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తంగా ఉందని, జిల్లాలోని ఆరోగ్య కేంద్రాలను పటిష్టంగా పర్యవేక్షిస్తున్నామన్నారు. వైద్య సిబ్బంది సమయపాలన, మెరుగైన వైద్య సేవలు అందించడంలో ఆదర్శంగా నిలుస్తారన్నారు. ఈ కార్యక్రమంలో ఘట్ కేసర్ తహాసీల్దారు రజని, మెడికల్ ఆఫీసర్, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.