20-06-2025 12:48:42 AM
ప్రజలకు మెరుగైన సేవలే లక్ష్యంగా అధికారులకు దిశానిర్దేశం
హుస్నాబాద్, జూన్ 19 : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో కలెక్టర్ హైమావతి గురువారం విస్తృతంగా పర్యటించారు. రెవెన్యూ సదస్సులు, పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసి, ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ముందుగా కలెక్టర్ కోహెడ మండలం సముద్రాలలో జరుగుతున్న నూతన ఆర్ వోఆర్ చట్టం, భూ భారతి రెవెన్యూ అవగాహన సదస్సును ఆకస్మికంగా పరిశీలించారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను త్వరగా ఫీల్ విచారణ పూర్తి చేసి పరిష్కరించాలని ఆదేశించారు. విచారణ పూర్తయిన దరఖాస్తులను వెంటనే ఆన్లైన్లో నమోదు చేయాలని, భూ భారతి చట్టం ప్రకారం వాటి పరిష్కారానికి పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు.
గరల్స్ హైస్కూల్ తనిఖీ.. స్టూడెంట్స్ తో ముచ్చట్లు
హుస్నాబాద్ లోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను కలెక్టర్ తనిఖీ చేశారు. పాఠశాలలో సౌకర్యాలు మెరుగుపరుస్తున్నందున అడ్మిషన్ల సంఖ్య పెంచాలని సూచించారు. మధ్యాహ్న భోజనం నాణ్యత, బోధనా విధానం గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి సమస్యలున్నా ధైర్యంగా తెలియజేయాలన్నారు. ప్రతి విద్యార్థి తమ చుట్టూ ఉన్న పిల్లలను పాఠశాలలో చేర్చుకునేలా ప్రోత్సహించాలన్నారు.
మంచి విద్యను అందిపుచ్చుకొని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరి, తమ కుటుంబానికి, పాఠశాలకు మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. వంట సిబ్బందితో మాట్లాడి, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ రుచికరమైన ఆహారాన్ని అందించాలని ఆదేశించారు.
బాలికల ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ, సిబ్బంది డుమ్మాపై ఫైర్
హుస్నాబాద్ లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కూడా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయుష్ క్లినిక్, ఐసీటీఎస్ కేంద్రాల్లో సిబ్బంది అందుబాటులో లేకపోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రి వేళల్లో సంబంధిత వార్డుల్లో సిబ్బంది తప్పనిసరిగా ఉండాలని సూపరింటెండెంట్ రమేశ్ రెడ్డిని హెచ్చరించారు. ఫార్మా మెడికల్ స్టోర్లో రిజిస్టర్లను పటిష్టంగా నిర్వహించాలని, కాలం చెల్లిన మందులు వాడకూడదని సూచించారు.
రోగులతో మాట్లాడి, ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని, ఇక్కడే వైద్యం చేయించుకోవాలన్నారు. వర్షాకాలంలో అంటువ్యాధులు, పాము, తేలు కాటుకు సంబంధించిన నిరోధక టీకాలు సరిపడా అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు.
ఆసుపత్రి లోపల, బయట ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని, రోగులకు మెరుగైన వైద్యం అందించాలని సిబ్బందికి సూచించారు. బ్లడ్ బ్యాంక్ అవసరంపై సిబ్బంది అడగగా, దాని ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం కలెక్టర్ హుస్నాబాద్ లోని ఎల్లమ్మ చెరువు సుందరీకరణ పనులను పరిశీలించారు.