calender_icon.png 30 December, 2025 | 9:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జూలై 2026 వరకు కూనారం ఆర్ఓబి నిర్మాణం పూర్తి చేయాలి

30-12-2025 08:12:15 PM

ఆర్ఓబీ పెండింగ్ భూ సేకరణ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి

4 నెలల కాలంలో జడ్పీ కార్యాలయం నిర్మాణం పూర్తి చేయాలి

పెద్దపల్లి పట్టణంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

పెద్దపల్లి,(విజయక్రాంతి): జూలై 2026  వరకు కూనారం ఆర్.ఓ.బి నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకుని రావాలని  జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ పెద్దపల్లి కూనారం రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి, ఆర్ అండ్ బి అతిథి గృహం ప్రహరి గోడ, జడ్పి కార్యాలయ నిర్మాణ పనులను  పరిశీలించారు. 

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ 119 కోట్ల 50 లక్షల వ్యయంతో  పెద్దపల్లి కూనారం రైల్వే ఓవర్ బ్రిడ్జి ప్రభుత్వం నిర్మిస్తుందని తెలిపారు.  పెద్దపల్లి కూనారం ఆర్.ఓ.బీ బ్రిడ్జి నిర్మాణానికి అవసరమైన పెండింగ్ భూ సేకరణ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి  ఆర్ అండ్ బి అధికారులకు అప్పగించాలని  కలెక్టర్  రెవెన్యూ డివిజన్ అధికారి కి సూచించారు. 

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు విడుదలైన నేపథ్యంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు వేగవంతం చేయాలని, జూలై 2026 నాటికి  ఆర్.ఓ.బీ పూర్తి  చేసి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకుని రావాలని కలెక్టర్ ఆదేశించారు.  మార్చి 2026 నాటికి అండర్ పాస్ నిర్మాణ పనులు రైల్వే శాఖ పూర్తి చేయాలని అన్నారు. 

రైల్వే ఓవర్ బ్రిడ్జికి సంబంధించిన సర్వీస్ రోడ్డు పనులు సమాంతరంగా జరగాలని కలెక్టర్ తెలిపారు. పెద్దపల్లి పట్టణంలోని ఆర్ అండ్ బి అతిథి గృహం ప్రహరి గోడ నిర్మాణ పనులు పూర్తి చేసి, అవసరమైన ల్యాండ్ స్కేపింగ్ పనులు చేపట్టాలని అన్నారు.  అతిథి గృహం వద్ద వి.ఐ.పి లు బస చేసే సమయంలో భద్రత సరిగ్గా ఉండేలా ఏర్పాట్లు చేయాలని అన్నారు. 

పెద్దపల్లి తహసిల్దార్ కార్యాలయ సమీపంలో నిర్మిస్తున్న జడ్పీ కార్యాలయం నిర్మాణ పనులు నెమ్మదిగా జరుగుతున్నాయని, పనులలో వేగం పెంచాలని ఏప్రిల్ 2026 నాటికి జడ్పీ కార్యాలయం అందుబాటులోకి తీసుకొని రావాలని కలెక్టర్ సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి బి.గంగయ్య, ఈఈ ఆర్ &బీ భావ్ సింగ్, తహసిల్దార్  రాజ్ కుమార్,  సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.