వచ్చే విద్యా సంవత్సరానికి ముందే హాస్టళ్లు, గురుకులాల్లో మరమ్మత్తులు పూర్తి చేయాలి
పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
సుల్తానాబాద్,(విజయక్రాంతి): ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా వెల్ఫేర్ వీక్ సందర్భంగా హాస్టళ్లు, గురుకులాల్లో చేపట్టిన చిన్నపాటి మరమ్మత్తు పనులను వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే పూర్తి చేయాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష బుధవారం ఫీల్డ్ సందర్శనలో భాగంగా సుల్తానాబాద్ ఎస్సీ రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించి అక్కడ సదుపాయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... డోర్లు, కిటికీల మరమ్మత్తులకుసంబంధించిన అంచనాలను ఈ రోజు సమర్పించాలని అధికారులను ఆదేశించారు.
అవసరమైన బడ్జెట్ విడుదలకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.పాఠశాలలోని కంప్యూటర్ ల్యాబ్, డైనింగ్ హాల్ను పరిశీలించి, విద్యార్థులకు మెరుగైన సదుపాయాలు కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు.అన్ని మరమ్మత్తు పనులను నిర్దేశిత గడువులో పూర్తి చేసి విద్యార్థులకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.అలాగే విద్యార్థులకు అందించే ఆహార నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలని, కిచెన్ పరిసరాలను క్రమం తప్పకుండా పరిశీలించాలని, ఆహారం నిల్వ విధానాన్ని తనిఖీ చేయాలని సంబంధిత సిబ్బందికి సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంట కళాశాల ప్రిన్సిపల్ కృష్ణమాచార్య, సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.






