21-06-2025 09:34:35 AM
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి,(విజయక్రాంతి): మారుతున్న జీవన శైలి, పని వత్తిడి వల్ల అనేక ఆరోగ్య సంబంధమైన సమస్యలు(Health problems) ఎదురవుతాయని, ఆరోగ్య సమస్యలను దూరం చేయడానికి ప్రతి దినం యోగా భాగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి(Collector Adarsh Surabhi) సూచించారు. శనివారం ప్రపంచ యోగా దినోత్సవం(International Yoga Day) సందర్భంగా ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో స్థానిక మర్రికుంట గిరిజన సంక్షేమ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమంలో కలెక్టర్, అధికారులు విద్యార్థులు పాల్గొని యోగా సాధన చేశారు. జిల్లా యోగా ప్రధాన కార్యదర్శి సుగుణ యోగాభ్యాసం చేయించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యాంత్రిక జీవితంలో పనిచేస్తూ అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తడానికి అవకాశాలు ఉంటాయని, వాటిని అధిగమించి సంపూర్ణ ఆరోగ్యంతో జీవించడానికి ప్రతి రోజు యోగా చేయాలని సూచించారు. అదేవిధంగా యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎక్కడైనా మాదక ద్రవ్యాలు అమ్ముతున్నట్టు తెలిసిన, వాడుతున్నట్లు తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ప్రతిజ్ఞ చేయించారు. ఈ యోగా కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. శ్రీనివాసులు, యువజన క్రీడల అధికారి సుధీర్ రెడ్డి, యోగా కార్యదర్శి సుగుణ, ఆయుష్ విభాగం డా. మంజుశ్రీ , డా. ఒమర్ అలీ, డా. జ్యోతి, జిల్లా అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.