8 July, 2026 | 2:41 AM

అయోమయం సర్ వార్తకు స్పందించిన కలెక్టర్

08-07-2026 02:03 AM

ఎర్రుపాలెం జులై 7( విజయ క్రాంతి): అయోమయం సర్ అనే వార్త కథనం విజయక్రాంతిలో మంగళవారం నాడు ప్రచురింపబడింది. ఈ వార్తకు స్పందించిన కలెక్టర్ టీఎస్ దివాకర మంగళవారం నాడు ఎర్రుపాలెం మండల తాసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించి అధికారులు ,రాజకీయ నాయకులతో మాట్లాడుతూ ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను భారత ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా అత్యంత పారదర్శకంగా, నిష్పాక్షికంగా, పూర్తి ఖచ్చితత్వంతో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ అధికారులను ఆదేశించారు.

ఎర్రుపాలెం మండల కేంద్రంలో కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ మాట్లాడుతూ... ప్రతి బీఎల్‌ఓ తప్పనిసరిగా బీఎల్‌ఓ యాప్ ద్వారా క్షేత్రస్థాయిలోనే వివరాలను నమోదు చేయాలని, సమాచార నమోదులో ఎలాంటి పొరపాట్లు చోటుచేసుకోకుండా అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.

ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటరు జాబితానే మూలాధారం అని, అందులో ప్రతి ఓటరు వివరాలు తప్పుల్లేకుండా నమోదు కావడం అత్యంత కీలకమని ఆయన అన్నారు. ప్రతి నమోదు ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఉండేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, డేటా నమోదు, ధృవీకరణ ప్రక్రియలో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. 

అర్హులైన ప్రతి ఓటరికి ఎన్యూమరేషన్ ఫారాలు అందించి, పూర్తి చేసిన ఫారాలను నిర్దేశిత గడువులోగా తిరిగి స్వీకరించి డిజిటైజేషన్ ప్రక్రియను సమయానికి పూర్తి చేయాలని ఆదేశించారు. ఎవరూ మిగిలిపోకుండా ప్రతి కుటుంబాన్ని చేరుకోవాలని, సర్వే ప్రక్రియలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు ఉండరాదని సూచించారు. కలెక్టర్ వెంట ఖమ్మం ఆర్డీవో శ్రీనివాస్, తహసిల్దార్ సునీత ఎలిజిబెత్, ఆర్ ఐ రవికుమార్, బి ఎల్ వో లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.