22 April, 2026 | 8:49 PM

దోమకొండ బాలికల రెసిడెన్షియల్ హాస్టల్‌ను సందర్శించిన జిల్లా కలెక్టర్

22-04-2026 07:45 PM

విద్యార్థినులతో మమేకమై ఆశయాలు తెలుసుకున్న కలెక్టర్

దోమకొండ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ బుధవారం దోమకొండ మండలంలోని బాలికల రెసిడెన్షియల్ వసతిగృహాన్ని సందర్శించి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్  విద్యార్థినులతో మమేకమై, ఒక్కొక్కరితో మాట్లాడి వారి ఆశయాలు, లక్ష్యాలను తెలుసుకున్నారు. "మీరంతా భవిష్యత్తులో మంచి ఉన్నత స్థాయికి ఎదగాలి. క్రమశిక్షణ, పట్టుదలతో చదివి తల్లిదండ్రులకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలి" అని విద్యార్థినులకు సూచించారు. వసతిగృహంలో మెనూ ప్రకారం భోజనం సక్రమంగా అందిస్తున్నారా అని విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక వసతులన్నీ విద్యార్థినులకు సక్రమంగా అందుతున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు.

మరుగుదొడ్లు, పారిశుధ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించి ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని ప్రిన్సిపాల్ ని ఆదేశించారు.హాస్టల్‌కు రావడానికి సి.సి. రోడ్డు మంజూరైనప్పటికీ వీధి దీపాలు లేవని ఎంపీడీవో  కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై వెంటనే స్పందించిన కలెక్టర్, సంబంధిత జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్, ట్రాన్స్‌కో అధికారులతో మాట్లాడి విద్యుత్ శాఖ సహకారంతో వైరు గుంజి వీధిదీపాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ పనులను గ్రామ పంచాయతీ నిధులు మరియు జిల్లా కలెక్టర్ నిధులతో వెంటనే పూర్తి చేయాలని సర్పంచ్ కి సూచించారు.అదేవిధంగా కాంపౌండ్ వాల్ పడిపోయిన విషయాన్ని గమనించి, దాని మరమ్మత్తు పనులపై జిల్లా సోషల్ వెల్ఫేర్ అధికారితో మాట్లాడి, కాంపౌండ్ వాల్ పునర్నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.