14-08-2025 12:29:29 AM
చేర్యాల, ఆగస్టు 13: సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని ముస్యాల గ్రామంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కె.హైమావతి ఆకస్మికంగా వచ్చి తనిఖీ చేశారు. అటెండెన్స్ రిజిస్టర్ వెరిఫై చేస్తూ ఓపి రిజిస్టర్ చెక్ చేస్తూ ఎక్కువ ఎలాంటి కేసులు వస్తున్నాయి,ఎంతమంది వస్తారు,అనే విషయాలను ఆరా తీశారు.మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయా అని అరా తీస్తూ సీజనల్ వ్యాధులకు సంబంధించి ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
ల్యాబ్ లో చేసే టెస్ట్ లు టీ హబ్ కి పంపించే టెస్ట్ ల వివరాలను ఆరా తీశారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని మెడికల్ ఆఫీసర్ కు తెలిపారు. తెలంగాణ మోడల్ స్కూల్ ను జిల్లా కలెక్టర్ పర్యటించారు. మోడల్ స్కూల్ వాతావరణం చాలా బాగుందని తెలిపారు.
స్కూల్ భవనం స్లాబ్ నుండి నీరు కారడంను గమనించి బిల్డింగ్ పైకి ఎక్కి చూసి దాబా పైన పడిన నీళ్లు ఎప్పటికప్పుడు బయటికి వెళ్లే పైపుల వెంబడి పూర్తిగా బ్లాక్ అయిన మూలంగా నీరు కారుతూ స్లాబ్ డ్యామేజ్ అవుతుందని చెత్తాచెదారం లేకుండా శుభ్రం చేయాలని ఉపాధ్యాయులను ఆదేశించారు.అలాగే చెట్ల ఆకులు దాబాపైకి రాకుండా ట్రిమ్మింగ్ చేసుకోవాలని తెలిపారు.
విద్యార్థులకు సెలబస్ ఎంతవరకు చెప్పారు అనే విషయాలు అడుగుతూ పాఠశాల విద్యాశాఖ రూపొందించిన ప్రణాళిక ప్రకారం సెలబస్ పూర్తి చేయాలని ప్రిన్సిపల్ మరియు ఉపాధ్యాయులను ఆదేశించారు.కలెక్టర్ వెంట చేర్యాల తాసిల్దార్ దిలీప్ కుమార్ తదితరులు ఉన్నారు.