30-05-2025 12:25:44 AM
- జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్
నాగర్ కర్నూల్, మే 29 (విజయక్రాంతి); ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎత్తిపోతల ప్రాజెక్టుల కోసం చేపడుతున్న భూసేకరణలో ఏటువంటి ఆలస్యం జరుగకుండా జూన్ 6 లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు.
గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ అమరేందర్తో కలిసి నీటిపారుదల, రెవిన్యూ, సర్వే ల్యాండ్ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పాలమూరురంగారెడ్డి, మహాత్మా గాంధీ కల్వకుర్తి, మార్కండేయ ఎత్తిపోతల పథకాల భూసేకరణ త్వరిత గతిన పూర్తి చేయాలన్నారు.
ప్రాజెక్టుల పనులపై సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా సమీక్షిస్తున్న నేపథ్యంలో, భూసేకరణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. చెక్కులు ఇవ్వడానికి అవార్డు ప్రక్రియ పూర్తున వెంటనే భూమి యజమానులకు చెల్లింపులు అందించాలన్నారు.సర్వే ల్యాండ్ అధికారులకు రెండు రోజుల్లో సర్వే పూర్తిచేయాలని ఆదేశించారు.
రెవిన్యూ, నీటిపారుదల, సర్వే శాఖల మధ్య సమన్వయం అవసరమన్నారు. మార్కండేయ ప్రాజెక్టు పరిధిలోని గ్రామాల్లో తక్షణమే సర్వే పూర్తి చేయాలన్నారు.కల్వకుర్తి పథకంలో ప్యాకేజీల సంఖ్య 28, 29, 30లకు సంబంధించిన తాడూరు, తెలకపల్లి, వంగూరు, వెల్దండ, అచ్చంపేట మండలాల్లో భూసేకరణ చివరి దశలో ఉందని, సంబంధిత అధికారులు జూన్ 6 నాటికి అవార్డు ప్రక్రియను పూర్తిచేయాలని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సమావేశంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అరుణ, నీటిపారుదల శాఖ అధికారులు సత్యనారాయణ రెడ్డి, పార్థసారథి, మురళి, జిల్లా సర్వే అధికారి నాగేందర్, ఆర్డీవోలు మాధవి, సురేష్ తదితరులు పాల్గొన్నారు.