19-06-2025 04:39:38 PM
సైనిక సహకారాన్ని నిలిపివేయండి : సీపీఎం
సుభాష్ విగ్రహం దగ్గర నిరసన..
నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): ఇజ్రాయిల్ దాడులతో అతలాకుతలమౌతున్న పాలస్తీనాకు సిపిఎం సంఘీభావం తెలియజేస్తుందని సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి(CPM District Secretary Tummala Veera Reddy) అన్నారు. గురువారం సిపిఎం అఖిలభారత కమిటీ పిలుపుమేరకు నల్గొండ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సుభాష్ విగ్రహం దగ్గర ఇజ్రాయిల్ యుద్ధోన్మాదం నశించాలి అని నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... పాలస్తీనాలో చిన్నారుల, మహిళలపై ఇజ్రాయిల్ చేస్తున్న అమానవీయ చర్యలను ఖండించారు. ఇజ్రాయిల్ క్రూరమైన దాడులపై మోడీ ప్రభుత్వం మౌనం వీడాలని, బాధిత పాలస్తీనా పట్ల మానవీయతను ప్రదర్శించాలని డిమాండ్ చేశారు.
ఇజ్రాయిల్ను ఓ మోసపూరిత రాజ్యంగా అభివర్ణించారు. ఇజ్రాయిల్ క్రూరమైన దురాక్రమణ చర్యలపై మోడీ ప్రభుత్వం మౌనంగా ఉందని, ఇది భారతదేశ మానవత్వపు వారసత్వానికి వ్యతిరేకమని చెప్పారు. హైదరాబాద్లో తయారు చేసిన డ్రోన్లను ఇజ్రాయిల్కు సరఫరా చేస్తున్నారని, వీటిని పాలస్తీనా, ఇరాన్లోని అమాయక ప్రజలపై ఉపయోగిస్తున్నారని చెప్పారు. ఈ తరహా సైనిక సహకారాన్ని భారత్ తక్షణం నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ‘పాలస్తీనా అరబ్బులకు చెందినది. హిందువులు, ముస్లిములు, క్రైస్తవులు, ఇతరులు భారతదేశంలో కలిసి నివసిస్తున్నట్లే యూదులు, క్రైస్తవులు అక్కడ శాంతియుతంగా జీవించాలి’ కానీ దీనికి విరుద్ధంగా, నేడు జియోనిస్టులు పాలస్తీనా పిల్లలను కాల్చివేస్తున్నారని, వారిని భవిష్యత్ ఉగ్రవాదులుగా ప్రకటిస్తున్నారని విమర్శించారు. పాలస్తీనా ప్రజల పోరాటం హిందూత్వ శక్తులు చిత్రించాలనుకుంటున్నట్లుగా మతపరమైన లేదా ఇస్లామిక్ యుద్ధం కాదని చెప్పారు.
బ్రిటిష్ వలసవాదానికి వ్యతిరేకంగా భారత దేశం చేసిన జాతీయపోరాటంతో సమానమైన పోరాటమని అన్నారు. దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇజ్రాయిల్ దాడులపై పూర్తిగా మౌనంగా ఉండటం సిగ్గుచేటు. ‘ఇజ్రాయిల్ దురాక్రమణను వెంటనే ఆపాలి. పాలస్తీనాను స్వతంత్ర, సార్వభౌమ దేశంగా గుర్తించాలి’ అని భారతదేశంలోని వామపక్ష పార్టీలు నిర్ద్వంద్వంగా డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నారీ ఐలయ్య, చిన్నపాక లక్ష్మీనారాయణ, పట్టణ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, జిల్లా కమిటీ సభ్యులు ఎండి సలీం, పుచ్చకాయల నర్సిరెడ్డి, మల్లం మహేష్ , ఖమ్మంపాటి శంకర్ ఆకారం నరేష్, మండల కార్యదర్శి నలపరాజు సైదులు, పట్టణ కమిటీ సభ్యులు తుమ్మల పద్మ, దండంపల్లి సరోజ, అద్దంకి నరసింహ, కోట్ల అశోక్ రెడ్డి, ఆవుట రవీందర్, సలివొజు సైదాచారి, బొల్లు రవీందర్ మహబూబ్ అలీ, నోములు యాదయ్య, కిరణ్, వెంకట్ రెడ్డి, ప్రభు చారి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.