calender_icon.png 12 February, 2026 | 4:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓటమి భయంతోనే కాంగ్రెస్ దాడులు

12-02-2026 02:56:37 AM

  1. బీజేపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడింది 
  2. డబ్బు, పోలీసుల అండతో అధికార దుర్వినియోగం 
  3. పురపోరులో బీజేపీ కీలక స్థానాల్లో విజయం సాధిస్తుంది
  4. జీహెచ్‌ఎంసీని మజ్లిస్‌కు కట్టబెట్టే కుట్ర జరుగుతోంది 
  5. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు

హైదరాబాద్, ఫిబ్రవరి 11 (విజయక్రాంతి): మున్పిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటమి భయం పట్టడంతో అనేక చోట్ల బీజేపీ కార్యకర్తలపై దాడులకు దిగిందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అన్నారు. పోలీసుల సమక్షంలోనే విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేశారని, ఈ విషయంపై రాష్ట్ర ఎన్నికల కమిషన్, పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ సరైన స్పందన రాలేదని ఆయన విమర్శించారు.

నారాయణఖేడ్, సుల్తానాబాద్, చెన్నూరు, షాద్‌నగర్, మహబూబ్‌నగర్, ఖానాపూర్, సదాశివపేట్, ఎల్లంపేట్, వైరా, కొత్తగూడెం, నిజామాబాద్ తదితర ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందన్నారు. అయినా ఈ ఎన్నికల్లో బీజేపీ అనేక కీలక స్థానాల్లో విజయం సాధిస్తుందన్నారు. బుధవారం బీజేపీ కార్యాలయంలో రాంచందర్‌రావు మీడియాతో మాట్లాడుతూ మంచిర్యాలలోనూ బీజేపీ కార్యకర్తలు, నాయకుల ఇళ్లపైన దాడులు చేశారని తెలిపారు.

తెలంగాణలో రాజకీయ పట్టును కోల్పోతామనే భయం పట్టుకోవడం వల్లే పోలింగ్ రోజున అనేక కేంద్రాల్లో బీజేపీ కార్యకర్తలపై దాడులకు దిగారని, అయినప్పటికీ తమ పార్టీ కార్యకర్తలు వెనుకడుగు వేయకుండా ధైర్యం గా నిలబడ్డారని ఆయన వివరించారు. డబ్బు, అధికార మదంతో గెలవాలని ప్రయత్నించిన కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు. మక్తల్‌లో బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య కాంగ్రెస్ ప్రభుత్వ హత్యేనని ఆయన ఆరోపించారు.

ఎన్ని ఒత్తిళ్లు, బెదిరింపులు ఉన్నా బీజేపీ కార్యకర్తలు అంకిత భావంతో పనిచేశారన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అనేక స్థానాల్లో ఓటమి తప్పదని, బీఆర్‌ఎస్‌కు కూడా అరకొర సీట్లే వస్తాయని రాంచందర్‌రావు తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్‌ను ఆశాస్త్రీయంగా మూడు భాగాలుగా విభజించారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ రాజకీయ లబ్ధికోసం.. ఒక కార్పొరేషన్‌ను దారుసలాం కేంద్రంగా ఉన్న మజ్లిస్ పార్టీకి కట్టబెట్టే కుట్రజరుగుతోందని ఆయన ధ్వజమెత్తారు. కోర్ హైదరాబాద్‌ను మజ్లిస్‌కు తాకట్టు పెట్టే విధంగా జీహెచ్‌ఎంసీని విభజించిందన్నారు.  

దీన్‌దయాళ్ ఉపాధ్యాయకు నివాళి

దీన్‌దయాళ్ ఉపాధ్యాయ సిద్ధాంతాలను పార్టీకి చెందిన ప్రతి ఒక్కరూ ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు సూచించారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ పుణ్యతిధి సందర్భంగా బుధవారం బీజేపీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. ప్రతి వ్యక్తి అభివృద్ధి కోసం ప్రధాని కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.