22-07-2025 01:09:17 AM
సనత్నగర్ ఇన్చార్జి కోట నీలిమ
సనత్నగర్, జూలై 21:- తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ హక్కులను కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుతున్నదని పీసీసీ ఉపాధ్యక్షురాలు, సనత్నగర్ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ కోట నీలిమ తెలిపారు. అందులో భాగంగానే పథకాల రూపకల్పన చేస్తున్నామన్నారు. టీపీసీసీ లీగల్ సెల్ చైర్మన్ పొన్నం అశోక్గౌడ్ అధ్యక్షతన గాంధీ భవన్లో సోమవారం న్యాయవాదుల సమావేశం జరిగింది.
ఈ కార్యక్రమానికి హాజరైన కోట నీలిమ మాట్లాడుతూ.. రాజ్యాంగ పరిరక్షణకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. భారత్ జోడో యాత్రతో రాహుల్గాంధీ దేశ ప్రజలతో మమేకం అయ్యారని చెప్పారు. ఆ క్రమంలో బీసీ, ఎస్సీ, ఎస్టీల బాధలు కళ్లారా చూశారని తెలిపారు. ఆదివాసీల పరిరక్షణకు సైతం నడుం బిగించారని పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రాజ్యాంగ పరిరక్షణకు ఆగస్టు 2న దేశవ్యాప్తంగా ఉన్న న్యాయ నిపుణులతో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేస్తోందన్నారు. ఈ సమావేశానికి తెలంగాణ నుంచి భారీ ఎత్తున న్యాయవాదులు తరలివస్తారని తెలిపారు.
ఇందులో భాగంగా అట్టడుగు వర్గాల ప్రజల ఉన్నతికి సమాలోచనలు ఉంటాయన్నారు. ఈ సమావేశానికి రాహుల్గాంధీ, ప్రియాంకగాంధీ సహా దేశంలోని ముఖ్య నేతలు వస్తారని తెలిపారు. తెలంగాణలో రాజ్యాంగ పరిరక్షణే ధ్యేయం గా సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని ప్రభు త్వం పని చేస్తోందని పునరుద్ఘాటించారు.