16-06-2025 12:29:10 AM
‘కోరుట్ల’ కాంగ్రెస్ ఇంచార్జ్ నర్సింగరావు
జగిత్యాల, జూన్ 15 (విజయక్రాంతి): పేద ప్రజల సొంతింటి కలను తెలంగాణలో నెరవేర్చిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని ఆ పార్టీ కోరుట్ల సెగ్మెంట్ ఇన్చార్జ్ జువ్వాడి నర్సింగరావు పేర్కొన్నారు. కోరుట్ల నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం మండలం యామాపూర్’లో ఆదివారం ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ కార్యక్రమం జరిగింది. కమిటీ సభ్యులతో కలిసి లబ్ధిదారులకు నర్సింగరావు ప్రొసీడింగ్ పత్రాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. మండలంలో ఎవరు మొదటగా ఇందిరమ్మ ఇల్లు పూర్తి చేస్తారో వారికి స్వయంగా తాను రూ. 10 వేల 1 వంద 16 నగదు బహుమతి అందిస్తానని ప్రకటించారు.
పేదలు సన్న బియ్యంతో కడుపు నిండా తినాలనే సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తుందన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా మంజూరు చేయలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం 18 నెలల వ్యవధిలోనే అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు జారీ చేసిందన్నారు.
గత బిఆర్ఎస్ ప్రభుత్వం అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు అందించడంలో పూర్తిగా విఫలమైందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 18 నెలల వ్యవధిలోనే అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాలను అందజేస్తుందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే మరింత అభివృద్ధికి కృషి చేస్తామని జువ్వాడి నర్సింగరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు, కార్యకర్తలుపాల్గొన్నారు.