6 July, 2026 | 12:59 PM

ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం

21-03-2025 01:51 AM

మోతే మార్చి20:- ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు ఆరోపించారు. గురువారం సిపిఎం పార్టీ మోతే మండల కమిటీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తాసిల్దార్ కార్యాలయం ముందు మహా ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక అధికారుల పాలనలో ప్రజా సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారయ్యిందన్నారు. ఎస్సారెస్పీ కాలువ పరిధిలో వేలాది ఎకరాలలో వరి పంట పూర్తిగా ఎండిపోయిందన్నారు. ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడం మూలంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు.

ఎండిపోయిన వరి పంటకు ఎకరాకు 30 వేల రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. మోతే మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని కోరారు.  అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తాసిల్దార్ కార్యాలయంలో అందజేశారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు కంపాటి శ్రీను, కక్కిరేణి సత్యనారాయణ, బానోతు లచ్చిరాం నాయక్, దోసపాటి శ్రీనివాస్, బూడిద లింగయ్య, తదితరులు పాల్గొన్నారు.