20-01-2026 01:22:37 AM
రౌడీ షీటర్ కంటే అధ్వానంగా మాట్లాడుతున్న సీఎం:
మాజీ మంత్రి రామన్న ధ్వజం...
ఆదిలాబాద్, జనవరి 19 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం మునిగిపోయే నౌకా అని రానున్న రోజుల్లో ప్రజలు గట్టి గుణపాఠం చెప్తారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగు రామన్న అన్నారు. సోమవారం స్థానిక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జోగు రామన్న మాట్లాడుతూ... బీఆర్ఎస్ పార్టీ గద్దెలను కూల్చమంటూ సీఎం రేవంత్ రెడ్డి పిలుపునివ్వడం చూస్తే ముఖ్యమంత్రి స్థాయిని మరిచి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తుండడం సిగ్గు చేటని ఈ వ్యాఖ్యలు సీఎం రేవంత్ రెడ్డి నిరంకుశత్వానికి నిదర్శనమని, ముఖ్యమంత్రి ఇటివల చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
హింసను ప్రేరేపించేలా రౌడీ షీటర్ కంటే అధ్వానంగా సీఎం రేవంత్రెడ్డి వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ప్రజల గుండెల్లో నుండి పుట్టుకొచ్చిన పార్టీ అని, పార్టీని చెరిపేయడం ఎవరి తరం కాదని స్పష్టం చేశారు. చనాక - కొరట ప్రాజెక్టుకు జిల్లాకు చెందిన స్వాతంత్ర సమరయోధుల పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు అజయ్, ఇజ్జగిరి నారాయణ, మెట్టు ప్రహ్లాద్, గండ్రత్ రమేష్, సేవ్వా జగదీష్, రాజన్న, శ్రీనివాస్, బట్టు సతీష్, దయానంద్ పాల్గొన్నారు.