17-01-2026 11:53:42 AM
ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్నగర్,(విజయక్రాంతి): దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి(MLA Yennam Srinivas Reddy) అన్నారు. శనివారం నగరంలోని తిరుమల దేవుని గుట్ట వద్ద స్వయంభువుగా వెలసిన శ్రీ తిరుమలనాథ స్వామి ఆలయ ప్రాంగణంలో మల్టీపర్పస్ షెడ్ నిర్మాణపు పనులకు మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ షెడ్ నిర్మాణానికి ముడా నిధుల నుంచి రూ.19 లక్షలతో పనులు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూఅతి పురాతనమైన ఈ స్వయంభూ శ్రీ తిరుమలనాథ స్వామి దేవాలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. స్వామి వారి అనుగ్రహం పట్టణ ప్రజలపైన సంపూర్ణంగా ఉండాలని ఆకాంక్షించారు. అంతకుముందు ఆలయ అర్చకులు ఎమ్మెల్యే కి పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి వేదాశీర్వచనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎన్.పి. వెంకటేష్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, నాయకులు సీజే బెనహార్, సాయి బాబా, ముకుంద రమేష్, ఫకృ , కృష్ణయ్య, తదితరులు పాల్గొన్నారు.