01-10-2025 01:09:24 AM
మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
చిట్యాల, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలను ఎండగట్టాలని,రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు.మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో చిట్యాల మండల పార్టీ అధ్యక్షుడు అల్లం రవీందర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ బాకీ కార్డును ఆయన విడుదల చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ గల్లీ ఎన్నికలైనా,ఢిల్లీ ఎన్నికలైనా గెలిచేది బీఆర్ఎస్ పార్టీయేనని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్నే ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారని చెప్పారు. కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలను మరిచిపోయారన్న భ్రమలో కాంగ్రెస్ నేతలు ఉన్నారని, కానీ ప్రజలకు అన్నీ గుర్తున్నాయన్నారు. కాంగ్రెస్ అబద్ధపు హామీలను గుర్తు చేయడానికే కాంగ్రెస్ బాకీ కార్డు ఉద్యమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు.
కాంగ్రెస్ అభయహస్తం ఆ పార్టీ పాలిట భస్మాసుర హస్తంగా మారిందని విమర్శించారు. ఈ బాకీ కార్డే కాంగ్రెస్ పతనాన్ని శాసిస్తుందన్నారు. మాజీ జడ్పిటిసి గొర్రె సాగర్, ఏరుకొండ రాజేందర్ గౌడ్, మడికొండ రవీందర్రావు, యూత్ మండల అధ్యక్షుడు తౌటం నవీన్, జూకల్ మాజీ సర్పంచ్ పుట్టపాక మహేందర్, కట్టెకోల్ల రాజు, జంబుల తిరుపతి, హరి భూషణ్ పాల్గొన్నారు.