18 April, 2026 | 5:31 PM

మహిళా రిజర్వేషన్ల పట్ల కాంగ్రెస్ పార్టీ ది వక్రబుద్ధి

18-04-2026 03:58 PM

బీజేపీ చిట్యాల  పట్టణ అధ్యక్షుడు 

గుండాల నరేష్ గౌడ్.

చిట్యాల,(విజయక్రాంతి): మహిళలకు 33% రిజర్వేషన్ లు కల్పించే చట్టాన్ని అడ్డుకోవడం ద్వారా, కాంగ్రెస్ పార్టీకి మహిళల పట్ల వారి సాధికారత పట్ల ఉన్న వక్రబుద్ధి  మరోసారి బట్టబయలైందని చిట్యాల బిజెపి పట్టణ అధ్యక్షుడు గుండాల నరేష్ గౌడ్ శనివారం విమర్శించారు. భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఇది చీకటి రోజు అని, దేశవ్యాప్తంగా కోట్లాది మంది మహిళామణులు ఆత్మగౌరవం కోసం, రాజకీయ ప్రాతినిధ్యం కోసం ఎదురుచూస్తున్న తరుణంలో వారి ఆశలపై కాంగ్రెస్ పార్టీ  నీళ్లు చల్లిందని, ఇది కేవలం ఒక చట్టాన్ని వ్యతిరేకించడమో, తమ వక్రబుద్ధిని ప్రదర్శించడమో మాత్రమే కాదని, ఇది దేశ శక్తి స్వరూపిణిని తీవ్రంగా అవమానించడమే అని ఆయన అన్నారు.

కాంగ్రెస్ నాయకులకు పదవులపై ఉన్న ఆసక్తి, మహిళాసాధికారతపై ఇసుమంతైనా లేదని, మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించే చట్టాన్ని అడ్డుకోవడం ద్వారా, కాంగ్రెస్ పార్టీకి మహిళలపట్ల వారి సాధికారత పట్ల ఉన్న దుష్టబుద్ధి మరోసారి బట్టబయలైందని మండిపడ్డారు. దశాబ్దాలుగా కాంగ్రెస్ ఉద్దేశపూర్వకంగా నాన్చుతూ వచ్చిన ఈ చట్టానికి  ప్రధాని  నరేంద్ర మోడీ  నాయకత్వంలో ఆమోదం లభించే సమయంలో కాంగ్రెస్ పార్టీ వారి మిత్రులంతా కలిసి కుంటి సాకులతో అడ్డుకున్నారని, ఇది వారి దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ఠ అని విమర్శించారు. కుటుంబ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ అయిన కాంగ్రెస్ పార్టీ మహిళలు చట్టసభల్లో అడుగుపెడితే తమ పీఠాలు కదులుతాయనే భయంతోనే  ఈ చారిత్రాత్మక నిర్ణయాన్ని అడ్డుకున్నారని పేర్కొన్నారు.