కోటా రద్దుకు కుట్ర
అందుకే జనగణనను నిలిపేశారు
కాంగ్రెస్ వస్తే దేశవ్యాప్త కులగణన
బీజేపీని ఓడిస్తేనే రాజ్యాంగానికి రక్ష
రైతుభరోసా వేశాం.. కేసీఆర్ ముక్కు నేలకు రాయి
సిద్ధుల గుట్ట సాక్షిగా పంద్రాగస్టులోపు రుణమాఫీ
హరీశ్రావు.. రాజీనామాకు సిద్ధంగా ఉండు
నిజామాబాద్, ఆర్మూర్ సభల్లో సీఎం రేవంత్రెడ్డి
నిజామాబాద్/ఆర్మూర్, మే 8 (విజయక్రాంతి ప్రతినిధి): రాజ్యాంగానికి, రిజర్వేషన్లకు ముప్పు ఏర్పడిందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. 1881 నుంచి క్రమంతప్పకుండా పదేండ్లకోసారి నిర్వహిస్తున్న జనగణనను పక్కన పెట్టిన మోదీ ప్రభుత్వం.. రాజ్యాంగాన్ని రద్దుచేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల రిజర్వేషన్ల్లను ఎత్తివేసే ప్రయత్నం చేస్తున్నదని ఆరోపించారు. ఈ ముప్పును ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ నగరంతోపాటు ఆర్మూర్లో ఏర్పాటుచేసిన సభలో బుధవారం సీఎం మాట్లాడారు. దేశవ్యాప్త కులగణన చేపట్టాని కాంగ్రెస్ చేస్తున్న డిమాండ్ను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెడచెవిన పెడుతున్నదని మండిపడ్డారు.
రిజర్వేషన్లను రద్దుచేసేందుకే 400 ఎంపీ స్థానాల్లో గెలిపించాలని ప్రజలను కోరుతున్నదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కులగణన చేపట్టి జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు. దేశ మూలవాసులకు బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన హక్కులను కాపాడుకోవాలంటే బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు. దేశంలో ఎన్నోసార్లు ఎన్నికలు జరిగినా ఈసారి జరుగుతున్న ఎన్నికలు ప్రత్యేకమైనవని, ఇవి రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లను కాపాడుకునే ఎన్నికలని పేర్కొన్నారు. నిజామాబాద్ రైతులకు పసుపుబోర్డు, వరంగల్కు కోచ్ ఫ్యాక్టరీ, నిజామాబాద్ నగరానికి రింగ్రోడ్డు, ఇంజినీరింగ్ కళాశా లలు రావాలంటే కాంగ్రెస్ అభ్యర్థి జీవన్రెడ్డిని గెలిపించాలని కోరారు.
వందరోజుల్లోనే ఎన్నో చేశాం
రాష్ట్రంలో వంద రోజుల్లో కాంగ్రె స్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చిందని సీఎం తెలిపారు. రూ.500కే వంటగ్యాస్ సిలిండర్, రూ.200 యూనిట్లలోపు ఉచిత కరెంటు ఇస్తున్నామని, రూ.22,500 కోట్లతో ౪.౫ లక్షల ఇందిరమ్మ ఇళ్ళు నిర్మిస్తామని తెలిపారు. మూడు నెలల్లో 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని, కులగణన చేసి బీసీ జనాభా లెక్కలు తీసేందుకు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టామని చెప్పారు. వంద రోజుల్లో ఇన్ని పనులు చేసిన తమను కేసీఆర్ దిగిపోవాలంటున్నారని విమర్శించారు. ఆర్మూర్ సిద్ధులగుట్ట సాక్షిగా ఆగస్టు ౧౫ నాటికి రైతులకు రూ.౨ లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించారు.
బీజేపీ అభ్యర్థి అర్వింద్ ఆరడుగుల అహంకారానికి ప్రతిరూపమని విమర్శించారు. తమ ప్రభుత్వం ప్రతిరైతు అకౌంట్లో రైతుభరోసా నిధులు వేసిందని, ఇక కేసీఆర్ అమరవీరుల స్థూపం వద్ద ముక్కు నేలకు రాయాలని డిమాండ్ చేశారు. హరిశ్రావు రాజీనామాకు సిద్ధంగా ఉండాలని సవాల్ చేశారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేతలు షబ్బీర్ అలీ, మహేశ్కుమార్గౌడ్, సుదర్శన్రెడ్డి, భూపతిరెడ్డి, కర్ణాటక మంత్రి బోసురాజు, ఎంపీ అభ్యర్థి జీవన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






