02-09-2025 12:32:12 AM
హైదరాబాద్, ఆగస్టు 1 (విజయక్రాంతి): సీబీఐ దర్యాప్తు పేరిట కాళేశ్వరం ప్రాజెక్టును ఎండబెట్టే కుట్ర జరుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. దర్యాప్తు సాకుతో తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసేందుకు చంద్రబాబు, మోదీతో కలిసి రేవంత్రెడ్డి భారీ కుట్ర పన్నుతున్నారని సోమవారం ఒక ప్రకటనలో ఆరోపిం చారు.
సీబీఐ దర్యాప్తు పేరుతో కేవలం కేసీఆర్, బీఆర్ఎస్ మీదనే దాడి జరగడం లేదని, తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును శాశ్వతంగా మూసేసి మన గోదావరి జలాలను ఆంధ్రాకు తరలించే కుతం త్రాలకు ఆ ముగ్గురు తెరతీశారని విమర్శించారు. తెలంగాణ గొంతుకగా ఉన్న కేసీఆర్, బీఆర్ఎస్ను లేకుండా చేసి రాష్ట్రంపై తిరిగి తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
మోదీ, చంద్రబాబు ఎజెండా మేరకు బనకచర్ల ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రేవంత్రెడ్డి, తెలంగాణ ప్రయోజనాలను పణంగా పెట్టి ఇక్కడి రైతుల నోట్లో మట్టి కొట్టారని మండిపడ్డారు. కాళేశ్వరంపై విచారణను సీబీఐకి అప్పగించడం అంటే ప్రాజెక్టును పూర్తిగా ఎండబెట్టడమేనని, సీబీఐ, ఈడీ, ఐటీ సంస్థలను మోదీ జేబు సంస్థలుగా విమర్శించిన రేవంత్, 48 గంటల్లోనే ఎందుకు మాట మార్చారో చెప్పాలని డిమాండ్చేశారు.
ఓ వైపు కాంగ్రెస్ అగ్రనాయకత్వం అంతా కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తుంటే, రేవంత్ మాత్రం మోదీ ప్రాపకం కోసం వాటిని ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. రాహుల్గాంధీకి చేదుగా అనిపిం చిన సీబీఐ, రేవంత్రెడ్డికి మాత్రం ముద్దొస్తుందా అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజె క్టు అంశాన్ని సీబీఐకి అప్పగించాలని కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్ కోరగానే ఒప్పుకోవడం ఆ రెండు పార్టీల అక్రమ సంబంధానికి సాక్ష్యమని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ర్ట సాధకుడిగా, బంగారు తెలం గాణ నిర్మాతగా చరిత్ర సృష్టించిన కేసీఆర్పై విష ప్రచారం చేయాలన్న దుర్మార్గ, రాక్షస ఆలోచనతో రేవంత్ ఉన్నారని కేటీఆర్ విరుచుకుపడ్డారు. గతంలో ఎస్ఎల్బీసీ టన్నెల్ కుప్పకూలినా, సుంకిశాలలో సైడ్ వాల్ కూ లినా, వట్టెం పంప్హౌజ్ కూలిపోయినా, పెద్దవాగు రెండుసార్లు కొట్టుకుపోయినా కేంద్ర ప్రభుత్వం కనీసం స్పందించలేదని గుర్తుచేశారు.
అప్పుడు రాని జాతీయ డ్యా మ్ భద్రతా అథారిటీ (ఎన్డీఎస్ఏ) మేడిగడ్డ రెండు పిల్లర్లు కుంగితే మాత్రం ఆగమేఘాల మీద వచ్చి తలాతోకలేని రిపోర్ట్ ఇచ్చిందని విమర్శించారు. రేవంత్రెడ్డిపై ఈగ కూడా వాలకుండా ప్రధాని మోదీ కాపాడుతున్న విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. పద్నాలుగేళ్ల ఉద్యమంలో, పదేళ్లు ప్రగతి ప్రస్థానంలో, రెండేళ్లుగా ప్రధా న ప్రతిపక్షంగా తెలంగాణ ఏకైక గొంతుకగా నిలుస్తున్న కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీని అణచివేసే కుట్రలను తెలంగాణ సమాజం తిప్పి కొడుతుందని స్పష్టం చేశారు.
సీబీఐకే కాదు, ఏ ఏజెన్సీకి కాళేశ్వరం విచారణ అప్పచెప్పినా బీఆర్ఎస్ భయపడదని, బీజేపీతో కలిసి కాంగ్రెస్ చేస్తున్న కుట్రలను ధైర్యంగా ఎదుర్కొంటామని ధీమా వ్యక్తంచేశారు. న్యాయ స్థానాలపై తమకు సంపూర్ణ నమ్మకం ఉం దని, అక్కడ పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు. బెదిరింపులు, కేసులు తమకు కొత్త కాదని, తెలంగాణ ప్రయోజనాల కో సం ఎన్ని పోరాటాలకైనా, ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమేనని స్పష్టంచేశారు.