పాఠశాలల్లో నిర్మాణ పనులు పూర్తిచేయాలి
సిద్దిపేట కలెక్టర్ మను చౌదరి
సిద్దిపేట, జూన్ 7 (విజయక్రాంతి): పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యే లోపు భవనాల నిర్మాణ పనులు పూర్తి చేయాలని సిద్దిపేట కలెక్టర్ మను చౌదరి సూచించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో పంచాయతీరాజ్, ఈడబ్ల్యూఐడీసీ అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షలో ఆయన మాట్లాడారు. పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరిచేందుకు అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా నిర్మాణ పనులు చేపట్టడం జరిగిందన్నారు. జిల్లావ్యాప్తంగా 814 పాఠశాలలో విద్యుత్, మరుగుదొడ్లు, తరగతి, వంట గదుల నిర్మాణం సహా పలు రకాల పనులు చేపడుతున్నట్లు చెప్పారు.
ఇప్పటి వరకు 176 పాఠశాలల్లో మాత్రమే పనులు పూర్తవడం పట్ల ఇంజినీరింగ్ అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. పాఠశాలలు ప్రారంభమయ్యే వరకు 100 శాతం పనులు పూర్తి చేయకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం గ్రూప్ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యలు ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లా పోలీస్ కమిషనర్ డాక్టర్ అనురాధ మాట్లాడుతూ.. పరీక్ష రోజు సిద్దిపేట పట్టణంలోని జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లు మూసివేయాలని సూచించారు. అభ్యర్థులు హాల్టికెట్, ఐడీ కార్డులు మాత్రమే తెచ్చుకోవాలని తెలిపారు. సమీక్షలో అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, వివిధ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.






