ఆర్టీసీలో ఔట్సోర్సింగ్ కొనసాగింపు
- డిసెంబర్ చివరి దాకా పొడిగింపు
ఔట్ సోర్సింగ్ విధానంలోనే డ్రైవర్ల రిక్రూట్మెంట్
రెగ్యులర్ పోస్టులను భర్తీ చేయాలంటున్న కార్మిక సంఘాలు
హైదరాబాద్, ఆగస్టు 6 (విజయక్రాంతి): ఆర్టీసీ లాభాల బాటలోకి వెళ్లిందని ఓవైపు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు చెప్తున్నా... నేటికీ ఆర్టీసీలో రెగ్యులర్ ఉద్యోగాల నియామకాల ఊసే లేకుండా పోయింది. ఈ ఏడాది మార్చి 1 నుంచి జూన్ 30 వరకు ఔట్ సోర్సింగ్ విధానంలో డ్రైవర్లు, కండక్టర్ల నియామకాలు చేపట్టిన యాజమాన్యం... ఈ విధానాన్ని కొనసాగించనున్నట్లు ప్రకటించింది.
ఈ మేరకు ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆర్టీసీలో ఉన్న డ్రైవర్ల కొరత నేపథ్యంలో ఈ ఏడాది చివరి వరకు ఔట్సోర్సింగ్ విధానంలో డ్రైవర్ల నియామకాలు చేపట్టనున్నట్లు ఆపరేషన్స్ ఈడీ తెలిపారు. హైదరాబాద్ నగరంలో పనిచేసే డ్రైవర్లకు రోజుకు రూ. 200, జిల్లాల్లో పనిచేసే వారికి రోజుకు రూ. 100 బత్తా ఇస్తామని, నగరంలో డ్రైవర్లు డబుల్ డ్యూటీ చేస్తే రూ. 800 అదనంగా చెల్లిస్తామని పేర్కొన్నారు.
గతంలో ఔట్సోర్సింగ్ డ్రైవర్ల నియామకాల సమయంలో వసూలు చేసినట్లుగా ప్రస్తుతం అభ్యర్థుల నుంచి ఎలాంటి డిపాజిట్ వసూలు చేయబోమన్నారు. డ్రైవర్ల నియాకమ ప్రక్రియకు మరింత సమయం పట్టనున్న నేపథ్యంలో సిబ్బంది కొరతను అధిగమిస్తూ ప్రయాణికులకు మెరగైన సేవలు అందించేందుకే ఈ ఔట్సోర్సింగ్ నియామకాలు చేపట్టినట్లు తెలిపారు.
అయితే ఔట్సోర్సింగ్ విధానంలో డ్రైవర్లను నియమిస్తూ మ్యాన్ పవర్ ఏజెన్సీలకు మేలు చేసే ప్రయత్నం జరుగుతోందని ఎన్ఎంయూ కార్మిక సంఘం రాష్ట్ర నేత మర్రి నరేందర్ ఆరోపించారు. ఔట్సోర్సింగ్ విధానంలో తీసుకుంటున్న డ్రైవర్లను శ్రమదోపిడీకి గురి చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం చెప్తున్న 3,038 పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.






