calender_icon.png 6 August, 2025 | 8:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేషన్ కార్డుల పంపిణీలో రసాభసా

06-08-2025 05:30:55 PM

కేసిఆర్ పథకాలను ప్రస్తావించిన జగదీశ్ రెడ్డి.. 

అభివృద్ధి జరగలేదంటూ అడ్డుకున్న వేణారెడ్డి..

కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య మాటల యుద్ధం..

నెమ్మికల్ లో కొద్దిసేపు ఉద్రిక్తత..

పోలీసుల చొరవతో అదుపులోకి వచ్చిన పరిస్థితి..

సూర్యాపేట (విజయక్రాంతి): జిల్లాలోని ఆత్మకూర్(ఎస్) మండలం నెమ్మికల్ గ్రామంలో బుధవారం లబ్ధిదారులకు నిర్వహించిన ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ కాపీలు, రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం కాస్తా రసాభసాగా మారింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి(MLA Guntakandla Jagadish Reddy), సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణరెడ్డి, జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ లు పాల్గొనగా జగదీశ్ రెడ్డి మాట్లాడే క్రమంలో జై జగదీశ్ రెడ్డి అంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. పోటీగా కాంగ్రెస్ కార్యకర్తలు జై దామన్న అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కేసీఆర్ ని పొగుడుతూ బీఆర్ఎస్ పార్టీ హయంలోనే ఆత్మకూరు ఎస్ మండలం అభివృద్ధి చెందిందని, నీళ్లు తీసుకువచ్చామని అంటూ కేసీఆర్ పథకాలపై జగదీష్ రెడ్డి మాట్లాడారు.

అదే సమయంలో సూర్యాపేట మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి కలగజేసుకుని బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఆత్మకూర్(ఎస్) మండలంలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కూడా ఇవ్వలేదని, కాళేశ్వరం ప్రాజెక్టు కాస్త కూలేశ్వరం అయిందంటూ అడ్డుకున్నారు. దీంతో జై దామన్న, జై జగదీష్ అన్న అంటూ ఇరు పార్టీల కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేయడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో కొద్దిసేపు ఇరు పార్టీ నాయకుల మధ్య తోపులాట జరిగింది. వెంటనే రంగంలో దిగిన పోలీసులు ఇరు పార్టీల కార్యకర్తలపై లాఠీ చార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. మరొక్క సారి ఇరు పార్టీల నాయకులు మాట్లాడే ప్రయత్నం చేయగా ఇది ప్రభుత్వ అధికారిక కార్యక్రమం అని అధికారులు మైకులు కట్ చేశారు. అనంతరం లబ్ధిదారులకు ప్రొసిడింగ్ కాపీలు అందజేశారు. పరిస్థితి అదుపులోకి రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.