1 April, 2026 | 2:35 AM

ఓటరు జాబితా ప్రక్షాళనకు రాజకీయ పార్టీల సహకారం అవసరం

01-04-2026 12:00 AM

జిల్లా ఎన్నికల రాహుల్ శర్మ

జయశంకర్ భూపాలపల్లి (మహబూబాబాద్) మార్చి 31 (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో త్వరలో చేపట్టనున్న ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్.ఐ.ఆర్) కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ కోరారు. మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలో తహశీల్దార్లు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి బూత్ స్థాయి అధికారి (బీ.ఎల్.వో) ప్రతి ఇంటిని కనీసం మూడు సార్లు సందర్శించి ఓటర్ల వివరాలను సరిచేయనున్నారని తెలిపారు. ఎన్నికల సంఘం ఎస్ ఐ ఆర్ నిర్వహణ తేదీలు ప్రకటించగానే షెడ్యూల్ రాజకీయ పార్టీల ప్రతినిధులకు సమాచారం ఇస్తామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని తెలిపారు. ముసాయిదా నమూనా తదుపరి ఓటరు జాభితా ప్రకటించి తదుపరి అభ్యంతరాలు తీసుకుంటామని, అనంతరం తుది ఓటరు జాబితా ప్రకటిస్తామని తెలిపారు.

రాజకీయ పార్టీలు బూత్ స్థాయిలో ఏజెంట్లను నియమించి, బీఎల్‌ఓలకు సహకరించడం ద్వారా ఈ ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేయడానికి దోహదపడుతుందన్నారు. ఓటరు జాబితా శుద్ధి ప్రజాస్వామ్య ప్రక్రియలో కీలక భాగమని, అందరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.జిల్లాలోని అర్హులైన ప్రతి ఒక్కరు తమ పేర్లు ఓటరు జాబితాలో ఉన్నాయో లేదో పరిశీలించుకొని, అవసరమైన సవరణలు చేయించుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, అన్ని మండలాల తహసీల్దార్లు, రిజిస్టర్డ్ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.