calender_icon.png 24 May, 2025 | 12:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మళ్లీ కరోనా కలకలం

24-05-2025 01:54:10 AM

రెండు తెలుగు రాష్ట్రాల్లోమళ్లీ కరోనా కేసులు కలకలం రేపుతున్నా యి. మొన్నటికిమొన్న ఏపీలోని విశాఖపట్నంలో  కరోనా కేసు బయటపడింది. తాజాగా తెలంగాణలో హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి చెందిన ఓ వైద్యుడికి కొవిడ్ పాజిటివ్ వచ్చిందనే విషయం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో కొవిడ్ అంశం మరోసారి చర్చనీయాంశమైంది. ఈ దశాబ్దం ఆరంభంలో వచ్చిన కొవిడ్ మహమ్మారి యావత్ దేశాన్ని గడగడలాడించింది.

భారతప్రభుత్వం రెండుసార్లు దేశమంతా లాక్‌డౌన్ ప్రకటించాల్సి వచ్చింది. జనజీవనం అస్తవ్యస్తమైంది. చైనాలోకి వూహాన్ నగరంలో పుట్టిన ఈ వైరస్ ప్రపంచ దేశాలన్నింటినీ చుట్టివచ్చింది.  లక్షల్లో కరోనా కేసులు నమోదు కావడం, వేలాల్లో మరణాలు సంభవించడం చరిత్రలో ఓ భయానక అనుభవం. ఇక మహమ్మారి వెళ్లిపోయిందనుకున్న నాలుగేళ్ల తర్వాత మళ్లీ కొవిడ్ కేసులు నమోదు కావడం చర్చనీయాంశమైంది.

గత కొన్నిరోజుల నుంచి హాంకాంగ్, సింగపూర్ దేశాల్లోని పలు నగరాల్లో కొవిడ్ కేసులు నమోదవుతున్నాయి. వారంతా రోగనిరోధకశక్తి తక్కువగా ఉన్నవారు, నాడు కరోనా టీకా తీసుకోనివారు, వయోవృద్ధులేనని  తెలిసింది.  గతంలో వెలుగు చూసిన వేరియంట్లు కాకుం డా, మళ్లీ కొత్త వేరియంట్లు ప్రబలుతండవచ్చనే అభిప్రాయం వైద్యనిపుణుల నుంచి వ్యక్తమవుతున్నది.

గత వారం సింగపూర్‌లో ఏకంగా 14,200 కరోనా కేసులు నమోదు అయ్యాయ ని, వీటి సంఖ్య ఇంకా పెరుగుతూ వస్తుందని అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాలను ప్రచురిస్తున్నాయి. అక్కడ రోజుకు సగటున 133 కేసులు నమోదవుతున్నాయనేది వార్తల సారాంశం. అలాగే హాంకాం గ్‌లోనూ కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. గత వారంలో 1,402 కేసులు నమోదయ్యాయని, అంతకు ముందు వారంతో పోలిస్తే.. ఆ సంఖ్య 13.66 శాతం పెరిగిందని సమాచారం.

వీటిలో 81 మంది ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా ఉందని తెలిసింది. మరణాలు కూడా పదుల సంఖ్యలో సంభవించాయని తెలియవచ్చింది. కొవిడ్ బాధితులకు వచ్చిన రుగ్మతలను బట్టి నేడు విస్తరిస్తున్న కరోనా జేఎన్-1 వేరియంట్‌కు చెందిందని వినవస్తున్నది. మే మూడ వ వారంలో భారత్‌లోని ముంబై, చెన్ను, అహ్మదాబాద్ వంటి నగరాల్లో కరోనా కేసులు నమోదు కావడం  ఆందోళన రేపుతున్నది.

ముంబైలో 95 కేసులు, అహ్మదాబాద్‌లో ఏడు కేసులు నమోదయ్యాయని గణాంకాలు చెప్తున్నాయి. రాష్ట్రాల పరంగా చూస్తే తమిళనా డు లో 34 కేసులు, కేరళలో 69 కేసులు, మహారాష్ర్టలో 44, కర్ణాటకలో 16 కేసులు, గుజరాత్‌లో ౮, ఢిల్లీలో ౩ కేసులు బయటపడ్డాయి. మొత్తంగా దేశవ్యాప్తంగా 257 కొత్త కొవిడ్- కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యనిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

భారత్‌లో కొవిడ్ ప్రభావం చాలా తక్కువగా ఉందని, ప్రజలెవరూ భయపడాల్సిన పని లేదని విజ్ఞప్తి చేస్తున్నా రు. కాకపోతే శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడే వృద్ధులు కాస్త అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. వారు తరుచూ చేతులను శుభ్రం చేసుకోవాలని, బయటకు వెళ్లినప్పుడు మాస్కులు ధరించడం ఉత్తమమని చెప్తున్నారు. 

 డాక్టర్ బుర్ర మధుసూదన్‌రెడ్డి