30-09-2025 06:57:50 PM
క్రీడలతో స్నేహభావం
కాటారం (విజయక్రాంతి): క్రీడలలో పాల్గొనడం వల్ల పోటీతత్వంతో పాటు దేహదారుడ్యత, మానసిక ప్రశాంతత, స్నేహభావం పెంపొందుతాయని దామెరకుంట సీనియర్ క్రీడాకారులు తోడే వీరన్న, ముద్దం కుమార్ యాదవ్, ముద్దం బాపు యాదవ్ అన్నారు. గ్రామంలోని క్రీడ మైదానంలో ఏర్పాటుచేసిన దామరకుంట క్రికెట్ లీగ్ 4 (డిపీఎల్ 4) పోటీలను మంగళవారం కోడెల దామోదర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు క్రీడాకారులు మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా గ్రామంలోని సీనియర్ జూనియర్, క్రికెట్ క్రీడాకారులు కొన్ని జట్లుగా ఏర్పడి క్రికెట్ లీగ్ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
రెండు దశాబ్దాల క్రితం అరకొరగా టీవీలు ఉండగా సెల్ ఫోన్లు అసలే లేవు, గ్రామాల్లో సాయంత్రం అయిందంటే చాలు, పాఠశాలల నుంచి తిరిగి వచ్చిన విద్యార్థులు, వ్యవసాయ పనులకు వెళ్లిన వచ్చిన వాళ్లు, పనులు ముగించుకొని గ్రామంలోని క్రీడ మైదానాల్లో క్రికెట్, వివిధ ఆటలు ఆడడం జరిగేది, అలాంటి గ్రామీణ వాతావరణం నేడు పూర్తిగా మారిపోయింది, సెల్ ఫోన్లు, వాట్సాప్, ఇంస్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్ లాంటి వివిధ యాప్ లో లీనమై మానవ సంబంధాలు కోల్పోతున్నారని తెలిపారు. ప్రతి దసరా పండుగకు గ్రామంలోని యువత అందరూ ఒకచోట చేరుకొని క్రీడలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.