భీమేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ..
ఏర్పాట్లపై ఇంచార్జి ఈఓ పర్యవేక్షణ
వేములవాడ, ఏప్రిల్ 6,(విజయక్రాంతి)రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధంగా ఉన్న శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో సోమవారం భక్తుల రద్దీ నెలకొంది. ఆలయానికి పెద్ద సంఖ్యలో విచ్చేసిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను ఆలయ ఇంచార్జి ఈఓ అంజనా రెడ్డి స్వయంగా పర్యవేక్షించారు.ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహిస్తున్న లడ్డు తయారీ విభాగం, లడ్డు కౌంటర్, పులిహోర ప్రసాదం నాణ్యతను పరిశీలించారు. అలాగే అన్నదాన సత్రంలో భక్తులకు అందిస్తున్న
వన్డే భోజన సదుపాయాన్ని తనిఖీ చేసి, భక్తులకు శుభ్రతతో కూడిన నాణ్యమైన ఆహారం అందించాలని సూచించారు.అదనంగా నిత్య కళ్యాణం నిర్వహణ విధానం, సంబంధిత రికార్డులు, భక్తులకు తాగునీరు అందించే చలివేంద్ర కేంద్రాన్ని కూడా పరిశీలించారు. అవసరమైన చోట్ల మెరుగుదల చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచనలు చేశారు.ఆలయానికి వచ్చే ప్రతి భక్తుడికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పక్కాగా ఉండాలని ఈఓ స్పష్టం చేశారు. ఈ పర్యవేక్షణ కార్యక్రమంలో ఆలయ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.




