ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం... 12 మందిపై కేసు
హైదరాబాద్: ఉస్మానియా మెడికల్ కాలేజీ(Osmania Medical College) హాస్టల్ ప్రాంగణంలో ర్యాగింగ్(Ragging) కలకలం రేపింది. ప్రభుత్వ డెంటల్ కాలేజీ అండ్ హాస్పిటల్కు చెందిన బీడీఎస్ మొదటి సంవత్సరం విద్యార్థులను సీనియర్ విద్యార్థులు వేధింపులకు గురిచేశారు. కళాశాల ప్రిన్సిపాల్ సంజీవ్ సింగ్ యాదవ్ చేసిన ఫిర్యాదు మేరకు, తెలంగాణ ర్యాగింగ్ నిషేధ చట్టం కింద 12 మంది ఫైనల్ ఇయర్కు BDS విద్యార్థులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ప్రభుత్వ దంత వైద్య కళాశాల విద్యార్థులు ప్రస్తుతం ఉస్మానియా వైద్య కళాశాల వసతి గృహంలో(Osmania Medical College Hostel) బస చేస్తున్నారు. తదుపరి విచారణ జరిగే వరకు కళాశాల ప్రిన్సిపాల్ ఆరుగురు ఫైనల్ ఇయర్ బీడీఎస్ విద్యార్థులను ఆరు నెలల పాటు సస్పెండ్ చేశారు. ఇంతలో, సుల్తాన్ బజార్ పోలీసులు కేసు నమోదు చేసి, ఇందులో ప్రమేయం ఉన్నవారికి కౌన్సెలింగ్ ఇచ్చి, దర్యాప్తు చేస్తున్నారు. ర్యాగింగ్ ఘటనలో ఇతర విద్యార్థులు ఎవరైనా ప్రమేయం కలిగి ఉన్నారేమో పరిశీలిస్తున్నామని, ఈ విషయంపై సమగ్ర విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.






