గుజరాత్లో ఘోర బస్సుప్రమాదం: ఆరుగురు మృతి
వడోదర: గుజరాత్లోని వడోదర జిల్లాలో(Vadodara) బుధవారం తెల్లవారుజామున హైవేపై ఆగి ఉన్న ట్రక్కును వేగంగా వచ్చిన ఒక ప్రైవేట్ బస్సు(Private bus) ఢీకొట్టడంతో ఆరుగురు మరణించగా, దాదాపు 20 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదం తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో వడోదర-హలోల్ హైవేపై(Vadodara-Halol Highway) కోటంబి గ్రామం సమీపంలో చోటుచేసుకుంది. రాజస్థాన్ నుండి గుజరాత్లోని సూరత్కు వెళ్తున్న లగ్జరీ బస్సు, ఒక ట్రక్కు వెనుక భాగాన్ని ఢీకొట్టిందని వడోదర జిల్లా ఎస్పీ సుశీల్ అగర్వాల్ వెల్లడించారు.
డ్రైవర్ టైర్లలో గాలి చూసుకోవడానికి రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ఆ ట్రక్కును, వేగంగా వచ్చిన బస్సు వెనుక నుంచి ఢీకొట్టిందని వడోదర జిల్లా ఎస్పీ(Vadodara District SP) చెప్పారు. బస్సులో ప్రయాణిస్తున్న వారిలో ఎక్కువ మంది రాజస్థాన్కు చెందినవారని పోలీసులు తెలిపారు. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే, వడోదర గ్రామీణ ప్రాంతంలోని జరోద్ పోలీస్ స్టేషన్(Jarod Police Station) సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సు దెబ్బతిన్న తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, సహాయక చర్యల్లో తోడ్పడేందుకు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (National Disaster Response Force) బృందాలను కూడా రప్పించినట్లు ఎస్పీ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.






