క్రూడాయిల్ ధరలు పైపైకి..
- 80 డాలర్లకు చేరువలో ఒక బ్యారెల్ ధర
- పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలే కారణం
న్యూఢిల్లీ, జూలై 8: మధ్యప్రాచ్యంలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు మరోసారి ఎగబాకుతున్నాయి. దివంగత సుప్రీం లీడర్ అంత్యక్రియలతో భావోద్వేగంలో ఉన్న ఇరాన్ హోర్ముజ్లో నౌకలపై దాడులకు దిగడంతో, అమెరికా ప్రతిదాడులు చేసింది. వీటికి ప్రతిగా ఇరాన్ గల్ఫ్ దేశాల్లోని అమెరికా బేస్లను టార్గెట్ చేసింది. తాజా పరిణామాల నేపథ్యంలో ఇరాన్లో సీజ్ ఫైర్ ముగిసిందంటూ ట్రంప్ చేసిన ప్రకటన.. అంతర్జాతీయంగా చమురు ధరలపై ప్రభావం చూపుతోంది. ట్రంప్ చేసిన ప్రకటనతో ప్రపంచ ఇంధన మార్కెట్లలో అనిశ్చితి నెలకొంది. బ్రెంట్ క్రూడ్ ధర 5 శాతానికి పైగా పెరిగి బ్యారెల్కు 78 డాలర్లకు చేరువైంది.
ఆందోళనలు ఇలాగే కొనసాగితే బ్రెంట్ క్రూడ్ ధర త్వరలోనే బ్యారెల్కు 80 డాలర్ల స్థాయిని తాకే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలపై కూడా పరోక్ష ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. అంతేకాకుండా ఇరాన్తో ఉన్న అవగాహన ఒప్పందం ఇక అమల్లో లేదని.. టర్కీలో నాటో సమావేశం సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అలాగే ఇరాన్తో కొత్త చర్చలు కొనసాగించే ఆసక్తి లేదని చేసిన వ్యాఖ్యలు ప్రపంచ మార్కెట్లో చమురు సరఫరాపై భయాందోళనలను మరింత పెంచాయి.






