ఉపరాష్ట్రపతి నగర పర్యటనపై సీఎస్ సమీక్ష
హైదరాబాద్, ఏప్రిల్ 23 (విజయక్రాంతి) : ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్కర్ ఈ నెల 26న హైదరాబాద్లో పర్యటించనున్నారు. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఏర్పాట్లపై సమీక్షించారు. సచివాలయంలో అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించిన ఆమె ఉపరాష్ట్రపతి పర్యటించే ప్రాంతాల్లో రోడ్లు మరమ్మతులు చేపట్టాలని ఆర్అండ్బీ అధికారులను ఆదేశించారు. నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని, అగ్నిమాపక సిబ్బంది అందుబాటులో ఉండాలని తెలిపారు. వైద్య సౌకర్యాలను సమాయత్తం చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ప్రొటోకాల్ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని చెప్పారు. సమావేశంలో డీజీపీ రవిగుప్తా, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, గవర్నర్ కార్యదర్శి వెంకటేశం, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టీనా చోంగ్తు, ఫైర్ సర్వీసెస్ డీజీ నాగిరెడ్డి, టీఎస్ఎస్పీడీసీఎల్ ఎండీ ముషారఫ్ ఆలీ పాల్గొన్నారు.






