12 May, 2026 | 8:01 PM

అన్నాసాగర్‌లో దొంగల బీభత్సం.. తొమ్మిది ఇళ్లలో చోరీలు

12-05-2026 06:51 PM

ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): మండలంలోని  అన్నాసాగర్ గ్రామంలో ఆదివారం రాత్రి దొంగలు స్వైరవిహారం చేశారు. తాళం వేసి ఉన్న ఇళ్లనే టార్గెట్ చేసి 9 ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. పండగపూట ఇతర ఇళ్లకు వెళ్లి వచ్చేసరికి ఈ ఘోరం జరిగిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

 30 తులాల బంగారం.. 28 తులాల వెండి

అన్నాసాగర్‌కు చెందిన గంగాగౌడ్ ఇంట్లో 30 తులాల బంగారం, 28 తులాల వెండి, రూ.25 వేల నగదును దొంగలు అపహరించుకుపోయినట్లు బాధితులు కన్నీరు పెట్టుకున్నారు. మాదిగ శ్రీను, సాయిలు ఇళ్లలో రూ.10 వేల వరకు నగదు, కర్రె పోచయ్య ఇంట్లో 20 తులాల వెండి, అర తులం బంగారం చోరీకి గురయ్యాయి. కొనుగోళ్ల రాములు, జంగిడి సురేందర్ ఇళ్లలో దుస్తులు, ఇతర వస్తువులు, శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో రూ.50 వేల నగదు, చీరలు ఎత్తుకెళ్లినట్లు బాధితులు తెలిపారు. రామచందర్ రెడ్డి, మంద నాగిరెడ్డి ఇళ్లలో పోయిన వస్తువుల వివరాలు ఇంకా తెలియరాలేదు. మిగతా ఇళ్లలో రూ.ఐదు నుంచి రూ.పదివేల లోపు నగదు, పట్టుబట్టలను దుండగులు అపహరించుకు వెళ్లినట్లు పేర్కొన్నారు.

 పరిశీలించిన పోలీసులు

ఈ ఘటనపై ఎల్లారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో స్థానిక ఎస్సై, సీఐతో పాటు జిల్లా సీసీఎస్ పోలీసులు, క్లూస్ టీం అధికారులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఫింగర్ ప్రింట్స్ సేకరించారు. దొంగలను పట్టుకొని తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. ఇదే తరహాలో వర్ని, రుద్రూర్ గ్రామాల్లో సైతం దొంగతనాలు జరిగినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. స్థానిక ముఠా లేదా బీహార్ ముఠా పనేమోననే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.