04-12-2025 12:20:23 PM
హైదరాబాద్: సైబరాబాద్, రాచకొండ పోలీసుల వెబ్సైట్లను(Websites Hacked ) గుర్తు తెలియని వ్యక్తులు హ్యాక్ చేసినట్లు సమాచారం. వారం రోజులుగా రెండు కమిషనరేట్ల పోలీస్ వెబ్ సైట్లు పనిచేయడం లేదని అధికారులు తెలిపారు. కమిషనరేట్ల పోలీస్ వెబ్ సైట్లలోకి మాల్ వేర్ చొరబడినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వెబ్సైట్లను క్లిక్ చేస్తే గేమింగ్ అప్లికేషన్ కు రీడైరెక్ట్ అవుతున్నట్లు గుర్తించారు. సర్వర్లను డౌన్ చేసి వాటిని నిర్వహిస్తున్న ఎన్ఐసీకి పోలీసులు సమాచారం ఇచ్చారు.
రెండు కమిషనరేట్లలోని ఐటీ బృందాలు సమస్య పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. వెబ్సైట్ల పునరుద్ధరణకు ఎన్ఐసీ పర్యవేక్షణలో ప్రతినిధులు పనిచేస్తున్నారు. ఎన్ఐసీ రెండు కమిషనరేట్ల పోలీస్ వెబ్సైట్ల సాఫ్ట్ వేర్ అప్ డేట్ చేస్తోంది. ఐటీ బృందం మళ్లీ హ్యాకింగ్ కాకుండా అధునాతన ఫైర్ వాల్స్ ఆడిట్ చేస్తున్నారు. ఈ సైట్లు కొన్ని రోజుల్లో అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు. ఎన్ఐసీ నిర్వహించే తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ నవంబర్ 13న హ్యాక్ చేయబడింది. ఈ విషయంలో ఒక రిజిస్ట్రార్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు(Hyderabad Cyber Crime Police) ఫిర్యాదు చేశారు. బీఎన్ఎస్, ఐటి చట్టం, గేమింగ్ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.