25-05-2025 09:01:23 PM
పాపన్నపేట: మేతకు వెళ్లిన పాడిగేదె ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు గురై అక్కడికక్కడే మృతిచెందింది. ఈ సంఘటన పాపన్నపేట మండలం(Papannapet Mandal)లోని కుర్తివాడ శివారులో ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పుట్టి వెంకటేశం వ్యవసాయంతో పాటు పాడి గేదెల ద్వారా వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో రోజూ మాదిరిగానే ఆదివారం గేదెలను మేతకు తీసుకెళ్లగా గ్రామ శివారులోని ఓ విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ వద్ద విద్యుత్ షాక్ కు గురై పాడి గేదె మృత్యువాత పడింది. విద్యుత్ అధికారులు, గ్రామ పశువైద్యాధికారి అవారి రాకేష్ లు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. విద్యుత్ అధికారులు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని బాధిత రైతు అధికారులను కోరారు.