అంబులెన్స్లో ప్రసవం తల్లీబిడ్డ క్షేమం
ములుగు, మార్చి26 (విజయక్రాంతి): గర్భిణీ స్త్రీకి ప్రసవ సమయం దగ్గర పడి పురిటినొప్పులు వచ్చి రక్త హినతతో అల్లాడుతున్నా ప్రభుత్వ వైద్యు లు ప్రసవం చేయకపోవడంతో 108 అంబులెన్స్ లో ములుగు జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో పురి టి నొప్పులు అధికం కావడంతో 108 అంబులెన్సులోనే తప్పనిసరి పరిస్థితిలో కాన్పు నిర్వహించారు. వాజేడు మండలం దూలాపురం గ్రామానికి చెందిన మోడెమ్ సమ్మక్క అనే గర్భిణీ స్త్రీ పురిటి నొప్పులతో బాధపడుతుండగా ముందుగా ఏటూరునాగారం ఆసుపత్రిలో వైద్య పరిక్షలు చేయడంతో కేవలం 6శాతం రక్తం ఉండి, ఉమ్మనీరు తగ్గిపోవడాన్ని పరీక్షించి ము లుగు జిల్లా ఆసుపత్రికి రిఫర్ చేశారు.
ఏటూరునాగారం అంబులెన్స్ సిబ్బంది ఆమెను ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో గోవిందరావుపేట పరిధిలో పురిటినొప్పులు అధికం అవడాన్ని గమనించిన టెక్నీషియన్ శివలింగంప్రసాద్ ఈఆర్సిపి డాక్టర్ మౌనిక సూచన సలహాలతో రక్త హీనతతో బాధ పడుతున్న గర్భిణీ స్త్రీతో వచ్చిన ఆశా కార్యకర్త సహకారంతో గర్భిణీకి సుఖ ప్రసవం నిర్వహించారు. మగ బిడ్డను ప్రసవించిన తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. అనంతరం ములుగు జిల్లా ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి తల్లి బిడ్డను రక్షించిన అంబులెన్స్ సిబ్బందికి గర్భిణీ స్త్రీ బంధువులు కృతజ్ఞతలు తెలిపారు.




