22-11-2025 04:22:31 PM
ఇసుక మాఫియాపై అనుమానం
కరీంనగర్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా పరిధిలోని ఓదెల మండలం గుంపుల మానేరు వాగుపై నిర్మించిన చెక్ డ్యాంను గుర్తుతెలియని వ్యక్తులు కూల్చివేశారు. ఇసుక మాఫియా పనిగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పెద్దపెల్లి జిల్లాలోని ఇసుక రీచ్ లలో గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలతో ఇసుక వెలికి తీతలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. దీంతో వాగులు, చెక్ డ్యాముల వద్ద ఇసుకను తరలించేందుకే ఇసుక మాఫియా ఈ కూల్చి వేతకు పాల్పడినట్టు తెలుస్తుంది. రూ.19 కోట్లతో నిర్మించిన చెక్ డ్యామ్ ను మనేరులో నీటి ప్రవాహాన్ని అపి సాగునీటి అవసరాలకు గత ప్రభుత్వ హయాంలో నిర్మాణాం పనులు చేపట్టగా ఇటీవలే పనులు పూర్తి అయ్యాయి.
చెక్ డ్యామ్ తెగిపోవడంతో నీరు వృధాగా పోతున్నాయి.మనేరులో అక్రనంగా ఇసుక తవ్వకాల కోసమే చెక్ డ్యామ్ కూల్చి వేసినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. చెక్ డాం పనులు పూర్తి కావడంతో అధికారులు ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్న సమయంలో ఇసుక అక్రమార్కులు ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారాన్ని అందుకున్న నీటిపారుదల శాఖ అధికారులతో పాటు పోలీస్ అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు ను చేదించే పనిలో పడ్డారు.