calender_icon.png 11 November, 2025 | 6:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

23 ప్రాంతాల్లో 262 కూల్చివేతలు

12-09-2024 02:30:00 AM

111 ఎకరాల ఆక్రమిత భూముల స్వాధీనం 

వివరాలు వెల్లడించిన హైడ్రా

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబరు 11 (విజయక్రాంతి): హైదరాబాద్‌లో హైడ్రా పేరు చెబితే కబ్జాదారుల గుండెల్లో గుబులు పుడుతోంది. అధికార, విపక్ష నేతల తారత మ్య బేధాలేవీ లేవంటూ ముందుగా ప్రకటించిన హైడ్రా.. ఓవైసీ ఫాతిమా, మల్లారెడ్డి కాలేజీల విషయంలో విద్యార్థులు నష్టపోయే క్రమంలో కొంత గడువు ఇస్తున్నట్లు, ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ల విషయంలో అప్పటికే ఆక్రమిత ప్రాంతాల్లో నివాసముండే నిర్మాణాలను కూల్చబోమని ప్రకటించింది. చెరువులు, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన 23 ప్రాంతాల్లో 262 అక్రమ నిర్మాణాలను కూల్చేసినట్లు హైడ్రా అధికారులు బుధవారం  వెల్లడించారు. 

బాధ్యతలు తీసుకున్న మూడు రోజులకే..  

రాష్ట్ర ప్రభుత్వం జూలై 19న విడుదల చేసి న జీవో నంబర్ 99 ప్రకారం హైదరాబాద్ డిజస్టార్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) ఏర్పాటు కాగా, పాత ఈవీడీఎం కమిషనర్‌గా జూన్ 24వ తేదీనే ఏవీ రంగనాథ్ బాధ్యతలు స్వీకరించారు. హైడ్రా ఏర్పాటు కాకముందే, తాను బాధ్యతలు తీసుకున్న మూడో రోజు నుంచే కమిషనర్  రంగనాథ్ హైడ్రా కార్యచరణకు శ్రీకారం చుట్టారు. జూన్ 27న లోటస్‌పాండ్ సమీపంలోని ఫిల్మ్ నగర్ కోఆపరేటివ్‌కు చెందిన పార్క్ ఆక్రమణలను తొలగించేందుకు కమిషనర్ రంగనాథ్ కూల్చివేతలు ప్రారంభించా రు.

ఈ సందర్భంగా లోటస్‌పాండ్, ఎమ్మెల్యే కాలనీలోని విజయ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ, బంజారాహిల్స్ మిథాలీ నగర్, గాజుల రామారంలోని మహదేవ్‌పురం, జూబ్లీహిల్స్, నందగిరిహిల్స్ ప్రాంతాల్లో పార్కులను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను కూల్చివేశారు. ఫిల్మ్‌న గర్, అమీర్‌పేట ప్రాంతాల్లో నాలాలపై ఆక్రమణలను తొలగించారు.

గాజుల రామారంలోని పరికి చెరువు, చింతలచెరువు, రాజేంద్రనగర్‌లోని భూమ్‌రుఖ్ చెరువు, చందా నగర్‌లోని ఈర్లచెరువు, బాచుపల్లిలోని ఎర్రకుంట చెరువు, గండిపేట బఫర్ జోన్లలోని ఖానాపూర్, చిలుకూరులలో, తుమ్ముడికుంటలోని ఎన్‌త అప్పా చెరువు, అమీన్‌పూర్ చెరువు, మాదాపూర్‌లోని సున్నం చెరువు, మల్లంపేటలోని కత్వ చెరు వు పరిధి ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో నిర్మాణాలు చేపట్టిన 13 విల్లాలను అధికారులు నేలమట్టం చేశారు. వీటితో పాటు రోడ్లు, ఫుట్‌పాత్‌లపై చేపట్టిన అక్రమ నిర్మాణాలను సైతం కూల్చివేశారు. మొత్తం అక్రమ నిర్మాణాల కూల్చివేతలలో హైడ్రా అధికారులు 111.72 ఎకరాలను తిరిగి స్వాధీనం చేసుకున్నారు. 

హైడ్రానా.. హైడ్రామానా..! 

హైడ్రా కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏవీ రంగనాథ్ రాజకీయాలకు అతీతంగా ఆక్రమణ నిర్మాణాలను నేలమట్టం చేస్తుంటే అనేక మంది ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యంగా సినీనటుడు అక్కినేని నాగార్జున ఎన్ కూల్చివేత సందర్భంలోనూ హైడ్రా అధికారు లను అభినందించని వారు లేరు. కానీ, ఓవైసీ ఫాతిమా, మల్లారెడ్డి కళాశాలలకు విద్యా సంస్థల పేరుతో, సినీ నటుడు మురళీ మోహన్, సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు నివాసానికి నోటీసులతో సరిపెట్టి.. మాదాపూర్ సున్నం చెరువు పరిధి లోని పేదల నివాసముండే ఇళ్లను కూల్చివేయడంపై హైడ్రా అధికారులు విమర్శ లు ఎదుర్కొంటున్నారు.