calender_icon.png 28 May, 2025 | 7:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాజీ సర్పంచుల నిర్బంధం

27-05-2025 09:49:03 PM

పెండింగ్ బిల్లుల కోసం హైదరాబాద్ వెళ్తుండగా అరెస్టు చేసిన పోలీసులు..

హుస్నాబాద్: గ్రామాల అభివృద్ధి కోసం శ్రమించిన సర్పంచులు అప్పుల ఊబిలో చిక్కుకుపోయారు. తమ పదవీకాలం ముగిసి 18 నెలలు కావస్తున్నా, గ్రామాల అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు చెల్లించకపోవడంతో ఆర్థికంగా చితికిపోయారు. ఈ దుస్థితిపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు మంగళవారం 'చలో హైదరాబాద్‌' కార్యక్రమానికి సిద్ధమైన సిద్దిపేట జిల్లా(Siddipet District) హుస్నాబాద్‌ మండల సర్పంచులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.

హుస్నాబాద్‌ మండల సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు గంగం మోహన్‌ రెడ్డి, మాజీ సర్పంచులు విజయ, తోడేటి రమేశ్, బత్తిని సాయిలు, బత్తుల మల్లయ్య, బత్తుల సునీత, పోలవేని లత, దుండ్ర భారతి, ఎడపల్లి ప్రేమలత, గీకురు రాజేశ్వరి తదితరులను పోలీసులు పోలీస్ స్టేషన్ లో నిర్బంధించారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ, గ్రామాల్లో కీలక పాత్ర పోషించిన సర్పంచులు ఎదుర్కొంటున్న ఈ కష్టాలు తీరని ఆవేదనను కలిగిస్తున్నాయి.

బిల్లులు చెల్లించకపోవడంతో ఇప్పటికే పలువురు సర్పంచులు ఆత్మహత్యలకు పాల్పడిన విషాద ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా చోటుచేసుకున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తమ న్యాయమైన డిమాండ్ల కోసం నిరసన తెలపడానికి వెళ్తున్న వారిని అడ్డుకోవడంతో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. "తమ న్యాయమైన డిమాండ్ల కోసం ఆందోళన చేయకుండా అడ్డుకోవడం దారుణం" అని వారు వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి, పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు.