02-02-2026 12:00:00 AM
మహబూబాబాద్, ఫిబ్రవరి 1 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా గూడూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని వట్టేవాగు చింతగట్టు సమీపంలో ఉన్న సమ్మక్క సారలమ్మ జాతర వద్ద జరిగిన తేలుకాటు సంఘటనలో రెడ్యాల గ్రామానికి చెందిన భక్తుడు కిన్నెర క్రిష్ కుమార్ (19) మరణించినట్లు గూడూ రు పోలీసులు తెలిపారు. క్రిష్ కుమార్ గత నెల 29న జాతరకు వచ్చి అడవిలో వంట చేసుకునేందుకు ప్రదేశాన్ని శుభ్రం చేస్తున్న సమయంలో తేలు కుట్టడంతో అస్వస్థతకు గురయ్యాడు.
తక్షణమే అతనిని గూడూరు ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స అందించగా, అనంతరం ఇంటికి వెళ్లాడు. తరువాత ఆదివారం సాయంత్రం వాంతులు అవుతుండటంతో మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించగా, చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి 11.13 గంటలకు మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. మృతుడి పెద్ద నాన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు గూడూర్ పోలీస్ వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.