26-06-2025 11:46:06 PM
శివసేన, ఎన్సీపీ మంత్రులపై సీఎం ఫడ్నవీస్ ఆగ్రహం..
ముంబై: మహారాష్ట్రలోని అధికార మహాయుతి కూటమిలో విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)కి చెందిన కొందరు మంత్రులు తమ పర్సనల్ సెక్రటరీలు, ఓఎస్డీలను అనధికారికంగా కొనసాగించడంపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్(CM Devendra Fadnavis) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో పలుమార్లు ఆదేశాలు జారీ చేసినప్పటికీ కొందరు సిబ్బంది వాటిని బేఖాతరు చేయడంతో నిబంధనలు ఉల్లఘించిన ఆరుగురు సిబ్బందికి క్రమశిక్షణ చర్యల కింద నోటీసులు జారీ చేశారు. ఈ పరిణామం కూటమిలో అంతర్గత విభేదాలను బహిర్గతం చేయడంతో పాటు ప్రతిపక్షాలకు విమర్శనాస్త్రంగా మారింది. ఇది కేవలం పర్సనల్ సెక్రటరీల సమస్య కాదని, ఇది కూటమి భాగస్వాముల మధ్య సమన్వయం లోపం, నమ్మకం లేకపోవడాన్ని చూపిస్తుందని కాంగ్రెస్ నేత విజయ్ వడెట్టివర్ తెలిపారు.